సోనియా మది: వైయస్ జగన్ కన్నా తెలంగాణతోనే ఎక్కువ చిక్కులు
ప్రస్తుతానికి ముఖ్యమంత్రిని మార్చకూడదనే నిర్ణయానికి పార్టీ అధిష్టానం వచ్చింది. మళ్లీ ముఖ్యమంత్రిని మారిస్తే పలుచనవుతామనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని మార్చకుండా అసమ్మతిని తగ్గించాలనే వ్యూహంతో కాంగ్రెసు అధిష్టానం పనిచేస్తోంది. ఇందుకు సంబంధించి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కొద్ది రోజులుగా తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. సోనియా గాంధీతో కూడా ఆయన చర్చించారు. ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ పోస్టుల భర్తీతో పాటు పిసిసి అధ్యక్షుడి నియామకం కూడా జరపడానికి అధిష్టానం సమాయత్తమైంది. ప్రజారాజ్యం పార్టీ విలీన ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని ఆలోచిస్తోంది.
పిసిసి అధ్యక్ష పదవికి బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మినారాయణ, శ్రీధర్ బాబు, సంభాని చంద్రశేఖర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బొత్స సత్యనారాయణను ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నారు. మిగతా ముగ్గురిలో ఎవరైనా ఆయన అంగీకరించే అవకాశాలున్నాయి. మొత్తం ప్రక్రియ జూన్ 5,6 తేదీలకు ఓ కొలిక్కి రావచ్చునని అంటున్నారు.