తెలంగాణ సమస్య పరిష్కార బాధ్యత కాంగ్రెసుదే: చంద్రబాబు
కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తమ పార్టీని ఎవరూ భూస్థాపితం చేయలేరని ఆయన అన్నారు. టిడిపిని నామరూపాలు లేకుండా చేస్తామని తెరాస నాయకులు అంటున్నారని, ఆ పని తెరాస వల్ల కాదని ఆయన అన్నారు. లాలూచీ పడి తెరాసను కాంగ్రెసులో కలిపేస్తారని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు అభిప్రాయాలు చెప్పాయని, సమస్యను పరిష్కరించాలని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు. జెండా అండలో పెరిగి, ఈ పార్టీలో ఉండి పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి అన్యాయం చేశారని ఆయన అన్నారు. పోరాడాలని చెప్పానని, కాంగ్రెసు కుట్రలను ఎండగట్టాలని చెప్పానని, తమ పార్టీని విమర్శిస్తుంటే దాన్ని ఎండగట్టాలని చెప్పానని ఆయన అన్నారు. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడానికి తాను ఏం చేయాలన్నా చేస్తానని ఆయన చెప్పారు. పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని, ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం, తెలుగువాళ్ల అభివృద్ధి కోసం పని చేశానని ఆయన అన్నారు.
తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో జరిగిన ఆత్మహత్యలను తాను ఖండించినట్లు ఆయన తెలిపారు. ఉద్యమాల సందర్భంగా విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తే అందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. తమ పార్టీపై రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసుకు రాజకీయాలు మాత్రమే ముఖ్యమయ్యాయని, ప్రజారాజ్యం పార్టీని కలుపుకున్నారని, తెరాసను కలుపుకుంటారని ఆయన అన్నారు. తెలంగాణ, సమైక్యాంధ్ర చర్చ జరుగుతోందని, దీనిపై మనం ఓ స్పష్టమైన అవగాహనకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాము ప్రణబ్ ముఖర్జీకి తాము తెలంగాణపై లేఖ ఇచ్చిన విషయాన్ని, కాంగ్రెసు తెలంగాణపై వ్యవహరించిన తీరును ఆయన వివరించారు.