తెలంగాణకు అనుకూలమా, దెబ్బనా?: బొత్స నియామకంపై సందేహం
అయితే, అందుకు విరుద్ధమైన మరో అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. బొత్స సత్యనారాయణ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతుండడం వల్ల పార్టీ తెలంగాణ నాయకుల నుంచి వ్యతిరేకత రాదనే ఉద్దేశం కాంగ్రెసు అధిష్టానానికి ఉన్నట్లు చెబుతున్నారు. తన తెలంగాణ అనుకూల వైఖరి వల్ల తెలంగాణ ప్రాంతంలోకి చొచ్చుకుపోవడానికి, తెలంగాణ నాయకులను కలుపుకుని పోవడానికి బొత్స సత్యనారాయణకు వీలు కలుగుతుందని, అందుకే బొత్స సత్యనారాయణను ఆ పదవికి ఎంపిక చేశారని అంటున్నారు. తెలంగాణలో సీమాంధ్ర నాయకులు ఎవరూ అడుగు పెట్టలేని వాతావరణంలో బొత్స సత్యనారాయణకు వ్యతిరేకత ఎదురు కాదని భావిస్తున్నారు.
రాయలసీమకు ముఖ్యమంత్రి పదవి దక్కడం వల్ల ఉత్తరాంధ్రకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చి, తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది అధిష్టానం ఆలోచన. తద్వారా తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనేది కాంగ్రెసు అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. అయితే, గులాం నబీ ఆజాద్ మాటలను బట్టి తెలంగాణ అంశాన్ని ఇప్పుడిప్పుడే పరిష్కరించడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధంగా లేదని తెలిసిపోతూనే ఉన్నది. అందువల్ల తెలంగాణ ప్రాంతంలో ఇబ్బందులు రాకుండా బొత్స సత్యనారాయణను పిసిసి పదవికి ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు.