తెలంగాణ ఇప్పట్లో తేలేది కాదు: తేల్చేసిన గులాం నబీ ఆజాద్
తెలంగాణ ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామని పార్టీ ప్రజాప్రతినిధులు హెచ్చరించడాన్ని ప్రస్తావించగా వారిని సముదాయిస్తున్నామని, ఎప్పటికప్పుడు వారికి సర్ది చెబుతున్నామని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్రను, తెలంగాణ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నారని, ఇటువంటి స్థితిలో సమస్యను పరిష్కరించడం అంత సులభం కాదని ఆయన అన్నారు. ప్రజలు యువనాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అందుకే కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశామని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందులున్న మాట వాస్తవమేనని, వాటిని కిరణ్ కుమార్ రెడ్డి అధిగమించగలరని ఆయన అన్నారు.
తెలంగాణపై 15 మంది కార్యకర్తలతో, శానససభ్యులతో, పార్లమెంటు సభ్యులతో చర్చించామని ఆయన చెప్పారు. తన హైదరాబాదు పర్యటనలో వెల్లడైన అంశాలను అధిష్టానానికి వివరించానని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించే విషయంపై ఆలోచన చేయలేదని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఒక్క రోజులో నాయకుడు కాలేదని, 40 ఏళ్లు పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు. వైయస్ మరణం బాధాకరమని, వైయస్ మృతి కాంగ్రెసుకు తీరని లోటు అని ఆయన అన్నారు.