మొబైల్లో ఇట్టే ఛార్జింగ్ అయిపోతోంది, ఛార్జింగ్ ఆదాకి చిట్కాలివిగో...

మొబైల్ తెరపై కనిపించే తళుకు బెళుకులు చూడడానికి బాగే! కానీ, బ్యాటరీ సామర్థ్యాన్ని హరిస్తాయి. కలర్ఫుల్ డిస్ప్లేను కాస్త తగ్గించండి. మొబైల్లో Auto-Brightness సదుపాయం ఉంటే సెట్ చేయండి. ఈ మోడ్లో బ్యాటరీ తక్కువ ఖర్చవుతుంది. డిస్ప్లే సెట్టింగ్స్లో కనిపించే Screen Timeout గురించి తెలుసుగా? దీని ద్వారా ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఎంత సమయం తెర ఆన్ అయ్యి ఉండాలో సెట్ చేయవచ్చు. ఈ 'స్క్రీన్ టైంఅవుట్'ను 30 సెకన్లలోపే సెట్ చేయండి.
వాడని సందర్భాల్లో బ్లూటూత్ ఆఫ్ చేయండి. దీంతో హ్యకర్లు, వైరస్ల దాడుల నుంచి తప్పించుకోవడం మాత్రమే కాకుండా బ్యాటరీ కూడా ఆదా. ఎఫ్ఎం రేడియోలను కూడా వినకుంటే ఆఫ్ చేయడం మేలు. ప్రయాణాల్లో ఎఫ్ఎం సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఎక్కువ బ్యాటరీ ఖర్చవుతుంది. వై-ఫై నెట్వర్క్ని అన్ని చోట్లా ఆన్ చేసి ఉంచొద్దు. సిగ్నల్స్ని వెతుక్కునే క్రమంలో ఎక్కువ ఛార్జ్ తీసుకుటుంది. వాడుతున్న వైర్లెస్ నెట్వర్క్ పరిధిలోనే వై-ఫై ఆన్ అయ్యి ఉండేలా చూసుకోవాలి. ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతుంటే Wi-Fi Toggle Widgetను ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. దీని ద్వారా నెట్వర్క్ పరధి దాటగానే వై-ఫై ఆఫ్ అవుతుంది.
అవసరం అనుకున్నప్పుడు మాత్రమే జీపీఎస్ను ఆన్ చేయండి. ఉపగ్రహం నుంచి సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటూ మీరున్న ప్రాంతాన్ని చూపే క్రమంలో బ్యాటరీ ఎక్కువ ఖర్చవుతుంది. థర్ట్పార్టీ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసినప్పుడు జీపీఎస్ను సౌకర్యాన్ని అడిగితే No ఎంచుకోవడమే మేలు. అక్కర్లేని అప్లికేషన్స్ని ఆన్ చేసి ఉంచడం వల్ల సీపీయూ వర్క్లోడ్ పెరిగి బ్యాటరీపై భారం పడుతుంది. అక్కర్లేని వాటిని ఎప్పటికప్పుడు క్లోజ్ చేయాలి. ఆండ్రాయిడ్ వాడుతుంటే Advanced Task Killer అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకుని ఆటోమాటిక్గా అక్కర్లేని వాటిని తొలగించవచ్చు.
ఇన్కమింగ్ కాల్ఎలర్ట్ని వైబ్రేషన్ మోడ్లో కంటే రింగ్టోన్ మోడ్లోనే ఉంచడం మేలు. ఆండ్రాయిడ్ మొబైల్లో Power Saver Mode ఆన్ చేయండి. ఇది బ్యాటరీ సామర్థాన్ని హరించే సర్వీసుల్ని ఆటోమాటిక్గా మేనేజ్ చేస్తుంది. స్క్రిన్ బ్రైట్నెస్ తగ్గించి టైం అవుట్ని నియంత్రిస్తుంది. ఆన్స్క్రీన్ యానిమేషన్స్ని డిసేబుల్ చేసేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 20 శాతానికి చేరుకోగానే పవర్ సేవర్ మోడ్ ఆన్ అవుతుంది. 'జ్యూస్ డిపెండర్' అప్లికేషన్తో కూడా ఆండ్రాయిడ్ యూజర్లు బ్యాటరీ వాడకంపై నిఘా పెట్టవచ్చు.