నెలాఖరులోగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ప్రరాపాకి రెండు స్థానాలు
కూర్పు విషయంలో అధిష్ఠానం పాత్ర ఈసారి మరింత అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాంనబీ ఆజాద్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రితో చర్చలు, సంప్రదింపులు ఆరంభమవుతాయని... నెలాఖరులోగానే అంతా పూర్తవుతుందని భావిస్తున్నారు. మారుతున్న పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుడి అభిప్రాయాల్నీ తీసుకునే అవకాశం లేకపోలేదు. మొత్తం 44 మంది వరకు మంత్రివర్గంలో సభ్యులుగా ఉండొచ్చు. కిరణ్కుమార్రెడ్డి 39 మందినే తీసుకున్నారు. వీరిలో వ్యవసాయశాఖ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేశారు.
తెలంగాణ విషయంలో దేవాదాయశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పదవి నుంచి వైదొలిగారు. రవాణాశాఖ బాధ్యతలు చూస్తున్న బొత్స సత్యనారాయణ పీసీసీ అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఆయనతో సహా ప్రస్తుతం మంత్రివర్గంలో 37 మందే ఉన్నారు. కీలకమైన వాణిజ్య పన్నులు, విద్యుత్తు, వ్యవసాయం తదితర శాఖలకు పూర్తిస్థాయి మంత్రులు లేరు. రెండు, మూడు ఖాళీలు ఉంచుతారనుకున్నా... అయిదుగురికి కొత్త వారికి అవకాశమివ్వొచ్చు. బొత్స మంత్రివర్గంలో కొనసాగేదీ లేనిదీ ఈ మార్పులు, చేర్పుల్లోనే తేలిపోనుంది. కిరణ్ మంత్రివర్గంలో శాఖల కేటాయింపు సమయంలోనే చిచ్చురేగింది. సుమారు పది మంది మంత్రులు తీవ్రస్థాయిలో అసమ్మతి బావుటా ఎగురవేశారు.
ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన దామోదర రాజనరసింహ ప్రస్తుతం ఉన్నత, సాంకేతిక విద్యలతోపాటు వ్యవసాయ శాఖను అదనంగా చూస్తున్నారు. గతంలో ఉన్నత విద్యకు ఒకరు, సాంకేతిక విద్యకు మరొకరు చొప్పున బాధ్యతలు నిర్వహించగా... రాజనరసింహకి ఒకేసారి ఈ రెండు పదవులు ఇచ్చారు. ఆయనకు హోం మంత్రిత్వశాఖ వంటి మరింత కీలకమైన శాఖను ఇస్తారన్న వూహాగానాలూ వినిపిస్తున్నాయి. ప్రజారాజ్యం నుంచి కడప జిల్లాకు చెందిన సి.రామచంద్రయ్య, విశాఖపట్నం జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావులకు అవకాశం రావచ్చని భావిస్తున్నారు. అధిష్ఠానం ప్రాధాన్యమివ్వాలనుకుంటున్న సామాజిక వర్గానికే వీరిరువురు చెందటంతో ఆ ఇబ్బందీ ఉండదని అంచనా. మరో స్థానం కావాలని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పట్టుబడుతున్నా... రావటం కష్టమేనని భావిస్తున్నారు.