ప్రణబ్తో భేటీ, తెలంగాణపై కాంగ్రెసు తెలంగాణ నేతలు తేలుస్తారా?
2009 డిసెంబర్ 9 నాటి చిదంబరం ప్రకటనను అమలుచేయాలన్న ఏకైక డిమాండ్తో తాము కోర్కమిటీ సభ్యులను కలవబోతున్నట్లు పొన్నం చెప్పారు. రాష్ట్రంలో 4 ముఖ్యమైన పదవు లను సీమాంధ్రులకు ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంత నాయకులెవరూ వ్యతిరేకించకుండా, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నారన్నారు. సీమాంధ్ర నాయకులు కూడా ఇదే విధంగా డిసెంబర్ 9నాటి ప్రకటనకు కట్టుబడేలా చర్యలు తీసుకోవాలని తాము కోరనున్నట్లు తెలిపారు. అహ్మద్పటేల్, ఆంటోని, సోనియాగాంధీలతో భేటీ ఇంకా ఖరారు కాలేదని చెప్పారు.
ప్రస్తుతం విదేశీపర్యటనలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి గులాంనబీ ఆజాద్ గురువారం రాత్రి ఢిల్లీకి రానున్నారు. వచ్చే రెండురోజులపాటు తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఢిల్లీలో మకాం వేస్తున్నందున ఆజాద్ వచ్చిన తర్వాత ఆయనతో కలిసి మరోసారి ప్రణబ్ను కలుస్తామని ఎంపీలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అధిష్ఠానం ఆమోదం తెలియజేస్తుందన్న విశ్వాసం తమకు ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణనీటిసరఫరాశాఖ మంత్రి కె.జానారెడ్డి పేర్కొన్నారు.