చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఈసారి పునర్వ్యస్థీకరణలో లేనట్లే
కాగా, ఈ నెల 26వ తేదీన గానీ 28వ తేదీన గానీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించవచ్చునని అంటున్నారు. మమతా బెనర్జీ రాజీనామా వల్ల రైల్వే శాఖ ఖాళీ అయింది. రైల్వే శాఖను తృణమూల్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడిని మంత్రివర్గంలోకి తీసుకని ఆయనకు ఇచ్చే అవకాశాలున్నాయి. ఎ. రాజా రాజీనామా తర్వాత టెలికం శాఖను అదనంగా కపిల్ సిబాల్ నిర్వహిస్తున్నారు. పునర్వ్యస్థీకరణలో డిఎంకెకు చెందిన దయానిధి మారన్ను కూడా తప్పించవచ్చునని అంటున్నారు.
ఆ విషయం అలా ఉంటే, రాష్ట్రానికి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులకు మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులకు మంత్రి పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి జైపాల్ రెడ్డి ఒక్కరే ఉన్నారు. సీమాంధ్ర నుంచి ఎక్కువ మందికి మంత్రి పదవులు దక్కాయి. దీంతో మధు యాష్కీ గౌడ్కు, అంజన్ కుమార్ యాదవ్కు మంత్రి పదవులు ఇస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రస్తుత స్థితిలో అంజన్ కుమార్ యాదవ్ మాటెలా ఉన్నా మధు యాష్కీ మంత్రి పదవిని స్వీకరిస్తారా అనేది అనుమానమే. ప్రస్తుతానికి చిరంజీవిని సిడబ్ల్యుసిలోకి తీసుకోవచ్చునని అంటున్నారు.