రాజ్యసభకు ఎంపికై కేంద్ర మంత్రి పదవి పొందడానికి చిరంజీవి విముఖత
పార్టీ అధిష్టానం తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వరిస్తానని ఆయన చెబుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో తనతో పాటు కాంగ్రెసులోకి వచ్చిన ముగ్గురు శాసనసభ్యులకు చిరంజీవి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. సి. రామచంద్రయ్య, అనిల్, గంటా శ్రీనివాస రావు పేర్లను ఆయన మంత్రి పదవుల కోసం ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. కోటగిరి విద్యాధర రావు, వేదవ్యాస్ కూడా అందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అదే సమయంలో ప్రజారాజ్యం నుంచి వచ్చిన ముగ్గురు నాయకులకు డిసిసి పదవులు ఇవ్వాలని ఆయన అడుగుతున్నట్లు తెలుస్తోంది. పిసిసి కార్యవర్గంలో తగిన స్థానాలను కూడా ఆయన తమ వర్గానికి ఆశిస్తున్నారు.
త్వరలో వేయబోయే సమన్వయ కమిటీలో చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తారని అంటున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం కోసం ఆ కమిటీని వేయాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం అనుకుంటోంది. ప్రజారాజ్యం పార్టీ విలీన సభ ముగిసిన తర్వాత చిరంజీవి కాంగ్రెసులో క్రియాశీల పాత్ర పోషిస్తారని అంటున్నారు.