కోస్తాపై తెలంగాణ బంద్ ప్రభావం, విజయవాడ దాకే..
తెలంగాణ ప్రాంతంలోని బస్సులు కదలడం లేదు. చెదురుమొదురుగా వాహనాలపై దాడులు జరిగాయి. రంగారెడ్డి జిల్లా తాండూరులో పది ప్రైవేట్ బస్సులపై దాడి జరిగింది. వాటి అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. తెలంగాణ బంద్ కారణంగా సికింద్రాబాద్-ఫలక్నుమా మార్గంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఎంజీబీఎస్, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ తెలియజేసింది. తెలంగాణ బంద్ కారణంగా సింగరేణి కార్మికులు విధులను బహిష్కరించారు. దాంతో గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
బంద్ కారణంగా తెలంగాణలో పలుచోట్ల తెలంగాణ వాదులు ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటున్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ఆర్టీసీ డిపో ఎదుట తెరాస, ఆర్టీసీ ఉద్యోగులు బైఠాయించడంతో 500 బస్సులు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 600, వరంగల్ జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో 800 బస్సులు నిలిచిపోయాయి. అదే విధంగా కరీంనగర్ జిల్లాలోని తొమ్మిది డిపోల పరిధిలో 860, నిజామాబాద్ జిల్లాలో ఆరు డిపోల పరిధిలో 630, మెదక్ జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 550, మహబూబ్నగర్ జిల్లాలోని ఎనిమిది డిపోల్లోని 834 బస్సులు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలోని ఆరు డిపోల్లో 600, నల్గొండ జిల్లాలో 650 బస్సులు నిలిచిపోయాయి.
తెలంగాణ ఐకాస తలపెట్టిన బంద్ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జంట నగరాల్లో మంగళ, బుధ వారాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ ఎ.కె. ఖాన్ ప్రకటించారు. దీంతోపాటు వారం రోజులు నగరంలో ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని నిషేధాజ్ఞలు విధించారు. ఎలాంటి ఆయుధాలతో తిరగరాదని కమిషనర్ ఆదేశించారు. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.