జగన్ సంస్థలపై మూకుమ్మడి దాడులు చేపడ్తారా?
ఆ వార్తాకథనం ప్రకారం - అనేక ఉల్లంఘనలు, అనేక వ్యవస్థలతో ముడిపడిన ఈ 'కేసు'ను పూర్తిస్థాయిలో తవ్వడం ఒక్క సీబీఐతో జరిగేది కాదు. ఈ నేపథ్యంలో ఎక్కడా సమన్వయ లోపం తలెత్తకుండా, దర్యాప్తు సమగ్రంగా సాగేందుకు వీలుగా కీలక విభాగాలతో కలిపి 'మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్' (ఎండీఐటీ) ఏర్పాటు చేయాలని సీబీఐ భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ అవసరాన్ని తెలియజేస్తూ ఎండీఐటీ ఏర్పాటు చేయల్సిందిగా తన ప్రాథమిక నివేదికలోనే రాష్ట్ర హైకోర్టును అభ్యర్థించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. సీబీఐ ఇప్పటికే జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలన్నింటికీ నోటీసులు పంపింది.
ఇప్పటిదాకా జరిగిన పరిశీలన ప్రకారం... జగన్ అక్రమాలపై పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని సీబీఐ ఒక నిర్ధారణకు వచ్చే అవకాశాలే బలంగా ఉన్నాయి. ఒకవేళ కోర్టు అందుకు అనుమతిస్తే... జగన్పై వచ్చిన ఆరోపణలన్నిటిపైనా దర్యాప్తు చేసేందుకు ఆయా సంస్థలు రంగంలోకి దిగుతాయి. అయితే, ఇలా వేటికవి దర్యాప్తు చేస్తే సమన్వయ లోపం తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఎండీఐటీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని ఆ దినపత్రిక రాసింది.
జగన్కు చెందిన జగతి పబ్లికేషన్లో సుమారు 56 కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. జగన్తోపాటు ఈ కంపెనీలన్నింటికీ ఆదాయపు పన్ను శాఖ ఇదివరకే నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీల్లో పలు సంస్థలు బోగస్ అని, నిధుల ప్రవాహం కోసం జగనే ఏర్పాటు చేశారని, ఇది భారీ కుంభకోణమని ఐటీ శాఖ ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చింది. మరోవైపు... విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన సండూర్ పవర్లోకి వచ్చిన విదేశీ పెట్టుబడులను 'సాక్షి'లోకి మళ్లించి 'ఫెమా'ను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు జరుపుతోంది.
అదే సమయంలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని తీవ్రస్థాయి మోసాల దర్యాప్తు కార్యాలయాన్ని (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ - ఎస్ఎఫ్ఓ) కూడా రంగంలోకి దించాలని సీబీఐ హైకోర్టును కోరనున్నట్లు తెలిసింది. జగతి పబ్లికేషన్స్, సండూర్ పవర్, సరస్వతి పవర్, భారతి సిమెంట్స్ లిస్టెడ్ కంపెనీలు కాకపోయినప్పటికీ వీటిలో పలు లిస్టెడ్ కంపెనీలు పెట్టుబడిగా పెట్టాయి. అవి ప్రజలనుంచి పెట్టుబడులు సేకరించినందున ఎస్ఎఫ్వోతోపాటు సెబీ కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సీబీఐ భావిస్తోంది.