రామోజీరావుపై వైయస్ జగన్ సాక్షి డైలీ అటాక్
జగన్ను రాజకీయంగా, మీడియాపరంగా తుడిచివేయడానికి ఇదే మహత్తర అవకాశం అన్నట్లుగా ఎల్లో మీడియా చెలరేగిపోతోందని విమర్శించింది. అసలు చంద్రబాబుకు, ఆయన తోకపత్రికకు, తెలుగుదేశం హైకమాండ్ లాంటి రామోజీకి ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటి, వీరికి తోడుగా ఈ మండలిలో చేరిన టీవీ -9కు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో ఈక్విటీ గురించి కేసులు దాఖలు చేసిన శంకర్రావు గాని, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎర్రన్నాయుడు గాని, వారికి మద్దతుగా పత్రికల్లో రాస్తున్న రామోజీ, తోకపత్రక యజమాని గాని ఎంత పరిశుద్ధమైన చరిత్ర గల వ్యక్తులో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించింది. వీరిలో ఏ ఒక్కరైనా తమ అస్తులు, సంపదలకు సంబంధించి సిబిఐ విచారణ కోరే ధైర్యం ఉందా అని సాక్షి దినపత్రిక అడిగింది. వారు ఎలాగూ ఆ పని చేయలేరని, వేరెవ్వరైనా సిబిఐ విచారణ జరిపించగలిగితే, ముందుగానే చేతులెత్తి తమకు తాముగా జైల్లో కూర్చోవడం తప్ప మార్గాంతరం లేని అవినీతి సమ్రాట్టులు వీరంతా అని సాక్షి వ్యాఖ్యానించింది.