CJP: బొద్దింక పార్టీకి బిగ్ షాక్..! మళ్లీ ఎక్స్ అకౌంట్ డౌన్..! అభిజిత్ అరెస్టు భయాలు..!
పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్ లతో పాటు దేశాన్ని పట్టి పీడిస్తున్న పలు సమస్యలపై ఆన్ లైన్ లో ప్రశ్నించేందుకు స్థాపించిన కాక్రోచ్ జనతా పార్టీకి కేంద్రం ఆటంకాలు తప్పడం లేదు. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్, ఇన్ స్టా ఖాతాల్ని ఓసారి బ్లాక్ చేయించి, మళ్లీ రిలీజ్ చేయించిన కేంద్రం..ఇవాళ మరోసారి కొరడా ఝళిపించింది. ఈ నెల 6న అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చి నిరసనలకు దిగుతానంటూ సీజేపీ(CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke)చేసిన ప్రకటనే ఇందుకు కారణం.
గత కొన్ని రోజులుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని మోడీతో పాటు పలువురు బీజేపీ పెద్దల రాజీనామాలు కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ హ్యాండిల్ పై పోస్టులు పెడుతోంది. ఇవాళ తమ పార్టీ తరఫున ముగ్గురు అధికార ప్రతినిధులు నియమిస్తున్నట్లు కూడా ప్రకటన చేసింది. జర్నలిస్ట్ సౌరవ్ దాస్ నేతృత్వంలో ముగ్గురితో ఈ టీమ్ ను ప్రకటించింది. 6వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగుతానని దిప్కే చేసిన ప్రకటన నేపథ్యంలో ఇవాళ సీజేపీ ఎక్స్ ఖాతాను నిలిపేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తమ పార్టీ ఎక్స్ హ్యాండిల్ ను ఎందుకు కేంద్రం నిలిపేసిందో అందరూ ప్రశ్నించాలని పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఇన్ స్టా లో పెట్టిన వీడియోలో కోరాడు. గతంలోనూ తమ అకౌంట్ ను బ్లాక్ చేసేందుకు కేంద్రం ప్రయత్నించి విఫలమైందన్నాడు. తాము కేవలం రాజీనామాలు అడుగుతుంటే ఇలా అకౌంట్ లు బ్లాక్ చేయడమేంటని ఆయన ప్రశ్నించాడు. ఇదేం ప్రజాస్వామ్యమని అభిజిత్ దిప్కే ఇన్ స్టా వీడియోలో ప్రశ్నించాడు. మరోవైపు తనను విమానాశ్రయంలోనే అరెస్టు చేసి జైలుకు పంపుతారేమోనని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన చెందుతున్నారని దిప్కే తెలిపాడు. అయినప్పటికీ, మన దేశం ఒక ప్రజాస్వామ్య దేశమని, శాంతియుత నిరసన తెలిపేందుకు తమకు అనుమతి లభిస్తుందని ఇప్పటికీ నమ్ముతున్నానని వెల్లడించాడు. తాను గాంధీ, అంబేద్కర్, భగత్ సింగ్, నెహ్రూలను ఎంతగానో ఆరాధిస్తానని స్పష్టం చేయాలనుకుంటున్నానన్నాడు.

అన్నింటికంటే ముఖ్యంగా, తాను భారత రాజ్యాంగాన్ని విశ్వసిస్తానని, అది మన ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి తన గళాన్ని వినిపించే హక్కును కల్పిస్తుందన్నాడు. ఒకవేళ జైలుకు వెళ్లాల్సి వస్తే, అలాగే కానివ్వండి. మనం ఇంకెంతకాలం భయంతో జీవించగలం? అని తెలిపాడు. చివరికి, ఈ దేశం కేవలం ఏ ఒక్క పార్టీకి చెందినది కాదని, మనందరికీ చెందినదిని, ఇది మన దేశం, ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న అని పేర్కొన్నాడు. మన భవిష్యత్తు నాశనమవుతుంటే, స్పందించాల్సిన బాధ్యత మనపై పడుతుందన్నాడు. ఈ దేశంలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు, మనమందరం కలిసి శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుత పద్ధతిలో మన గళాన్ని వినిపించాలన్నాడు.














Click it and Unblock the Notifications