లోక్పాల్ ముసాయిదాకు ఓకె, ప్రధాని మినహాయింపు
డ్రాఫ్ట్ బిల్లును కేబినెట్ కొద్దిపాటి మార్పులతో ఆమోదించిందని, ఛైర్ పర్సన్ గా సర్వీసులో వున్న లేదా రిటైరైన సుప్రీం కోర్టు న్యాయమూర్తి వుంటారని సమాచార శాఖ మంత్రి అంబికా సోని తెలియపరచారు.
కేబినెట్ ఆమోదించిన డ్రాఫ్టుకు సివిల్ సొసైటీ సభ్యులు తమ విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ బిల్లు డ్రాఫ్టు లోని అంశాలు ఒకదాని కొకటి సంబంధం లేకుండాను, సరిగ్గాను లేవని, సామాన్య మానవుడికి అనుకూలంగా లేదని కిరణ్ బేడి వ్యాఖ్యానించారు. బిల్లు తీరు ప్రజల ఆశయాలకు దూరంగా ఉందని, పార్లమెంటులో సమర్పించే బిల్లు మరింత పటిష్టమైన చట్టంగా ఉండాలని సామాజిక కార్యకర్త అన్నా హజారే వివాదిస్తున్న సందర్భంలో బిల్లు మరో మారు పున: సమీక్ష చేయాలన్నారు.
'కాంగ్రెస్ కా హాధ్, ఆమ్ ఆద్మీ కే సాధ్ " అనే నినాదంతో కాంగ్రెస్ లోక్ పాల్ బిల్లు అంశంలో దూసుకుపోతోంది. లోక్ పాల్ బిల్లు సామాన్య మానవుడు తొలగించాలనుకునే అవినీతిని అంతమొందించగలదని తాను ఆశిస్తున్నట్లు అన్నా హజారే చేసిన వ్యాఖ్యలు 'టైమ్స్ నౌ " టెలివిజన్ ఛానెల్ బుధవారం నాడు పేర్కొంది. భారత దేశ చరిత్ర మార్చటానికి ఈ ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం వచ్చిందని, ప్రభుత్వం కనుక సమర్ధవంతమైన లోక్ పాల్ బిల్లును సమర్పించగలిగితే దేశ ప్రజలు దానికి రుణపడి వుండగలరని కూడా ఆయన అన్నట్లు తెలిపింది. ప్రస్తుత లోక్ పాల్ బిల్లు ప్రజల ఆశయాలకు దూరంగా వుందని, అది చాలా బలహీనంగాను, సమర్ధత లేనిదిగాను, తక్కువ పరిధిగలదిగాను వుందని అన్నా హజారే వ్యాఖ్యానించారు. మరో సివిల్ సొసైటీ సభ్యుడు అరవింద్ కేజరీవాల్ బిల్లులో అవినీతి అంశాన్ని పక్కన పెట్టారని, అందులో సామాన్య మానవుడికి అవసరమైనదేదీ లేదని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం మొదటగా ఉన్నత స్ధాయి అవినీతిని తొలగించాలనుకుంటోందని లాయర్ ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. దీనిలో భారీ కుంభ కోణాలైన ఆదర్శ హౌసింగ్, కామన్వెల్త్ గేములు, రెడ్డి బ్రదర్స్ , మైనింగ్, జార్ఖండ్ ముక్తి మోర్చా, కేష్ ఫర్ వోట్స్, పశువుల దాణా, తాజ్ కారిడార్ మొదలైనవేవీ ప్రభుత్వ లోక్ పాల్ లో లేవన్నారు. ప్రభుత్వం కనుక ఈ తప్పుల తడికల బిల్లును ప్రవేశ పెడితే, స్టాండింగ్ కమిటీ సైతం ఏమీ చేయలేదని కేజరీవాల్ వాదించారు. పార్లమెంటుకు, స్టాండింగ్ కమిటీకి కొన్ని లిమిటేషన్స్ వుంటాయని, స్టాండింగ్ కమిటీ ఒక చట్టాన్ని వ్యతిరేకించవచ్చని, అంతే కాని వున్న చట్టాన్ని సవరించటం చేయలేదని, లేదా సవరణలు సూచించగలదని చెప్పారు. వున్న చట్టాన్ని పూర్తిగా రీ-ప్లేస్ చేయలేదని లేదా చట్టం లోని మూల సిద్ధాంతాలను మార్చలేదని కేజరీవాల్ అభిప్రాయపడ్డారు.