టెన్షన్ పేరుతో చిరంజీవి విలీనసభ రద్దు
తన ప్రజారాజ్యం పార్టీకి చెందిన శాసనసభ్యులతో తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం విలీన ప్రక్రియ వెనక్కి పోతుండడం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ ఊసు లేకపోవడం వంటి సమస్యలపై చిరంజీవి వారితో సమావేశమైనట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని భావించారు. అయితే, తెలంగాణ శాసనసభ్యుల రాజీనామాల నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ ప్రక్రియ వెనక్కి వెళ్లింది.
కాగా, తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలపై తాము చిరంజీవితో చర్చించినట్లు శాసనసభ్యుడు ఘంటా శ్రీనివాస రావు సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. స్థానిక సమస్యలపై తాము ముఖ్యమంత్రికి వివరించాలని అనుకున్నామని, ఇంతకు ముందు ఇదే విషయంపై ముఖ్యమంత్రిని కలిశామని ఆయన చెప్పారు. అయితే ఆప్పుడు రాష్ట్రపతి పర్యటన వల్ల ముఖ్యమంత్రి ఎక్కువ సమయం ఇవ్వలేకపోయారని, దాంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నామని, దానిపై సమావేశంలో చర్చించామని ఆయన వివరించారు.