సమ్మెకు దిగే తెలంగాణ ఉద్యోగులకు ఉద్వాసన?
ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సమ్మెకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 8వ తేదీ నుంచి తెలంగాణకు చెందిన ప్రభుత్వోద్యోగులు సకల జనుల సమ్మెలో పాల్గొనడానికి నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఉద్యోగులు సమ్మె చేయడాన్ని సీమాంధ్ర నాయకులు వ్యతిరేకిస్తుండగా, తెలంగాణ రాజకీయ నేతలు సమర్థిస్తున్నారు. వారికి కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు వంటి నాయకుల మద్దతు కూడా ఉంది.
తెలంగాణ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఓ శాఖలో ఇప్పటికే ఎస్మాస్త్రం ప్రయోగించింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి చెందిన ఆర్థిక శాఖపై ప్రభుత్వం ఎస్మాస్త్రం ప్రయోగించింది. పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ, ఆర్థిక శాఖ తదితర శాఖల్లో సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా శాఖలను అత్యవసర సేవల క్రిందకు తీసుకు వచ్చిన నేపథ్యంలో ఆ శాఖల్లో ఎవరూ సమ్మెలు చేయడానికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఈ చట్టం తీసుకు వచ్చింది.