హైకోర్టు తీర్పుపై ప్రశ్నలు వేసిన వైయస్ జగన్
శంకర రావు చేసిన ఆరోపణల్లో ఏ ఒక్క దానికీ ప్రాథమిక సాక్ష్యాధారాలున్నట్లుగా కారణాలు చూపించలేదు. ఒక్క ఆరోపణనూ తేల్చలేదు.. ఈ తీర్పు చెల్లుబాటవుతుందా?
రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఒక్క ప్రభుత్వాధికారి గానీ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయలేదు. తమ వైఖరేంటో చెప్పలేదు. అలాంటప్పుడు నాపై చేసిన ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యత శంకర రావుది కాదా?
నా కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన సంస్థలు ప్రభుత్వం నుంచి అక్రమంగా లబ్ధి పొందాయా? దానికి ప్రతిగానే పెట్టుబడి పెట్టాయా? ఆరోపణలన్నిటికీ మూలమైన ఈ అంశానికి ప్రాథమిక ఆధారాలున్నట్టు తేల్చటంలో హైకోర్టు ధర్మాసనం విఫలమయిందా?
నిజానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కేబినెట్ సమష్టిగా తీసుకున్నవే. సమష్టి బాధ్యత అనే సూత్రం వర్తిస్తుంది కనక దాన్లోని తప్పొప్పుల్ని నా తండ్రి ఒక్కరికే ఆపాదించజాలరనేది గుర్తించటంలో హైకోర్టు ధర్మాసనం వైఫల్యం ఉందా?
హైకోర్టు తీర్పుపై మౌలిక ప్రశ్నలు
తన ఆరోపణలకు సంబంధించి శంకర రావు నేరుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికే లేఖ రాశారు. దాన్ని స్వీకరించి వేగంగా విచారణ జరిపించిన కోర్టు... ఆయన కనీసం పోలీసుల్ని కూడా సంప్రతించలేదన్న వాస్తవాన్ని విస్మరించి తీవ్రమైన పొరపాటు చేసిందా?
ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు ఉండగా నేరుగా హైకోర్టును ఆశ్రయించజాలరని 'సకిరి వాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, (2008) 2 ఎస్సీసీ" కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న అంశాన్ని హైకోర్టు విస్మరించిందా?
శంకర రావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే. ఇప్పుడు మంత్రి కూడా. కానీ తాను మంత్రిగా ఉన్న ప్రభుత్వంపైనే విశ్వాసం లేక సీబీఐ దర్యాప్తును కోరుతున్నారు. ఈ వాస్తవాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలి కదా?
శంకర రావు ఆరోపణలన్నీ 2004-2009 మధ్య జరిగిన సంఘటనలకు సంబంధించినవి. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన పిటిషనర్... దీనిపై 2010 నవంబరులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటం మినహా ఎలాం టి ఫిర్యాదు చేయటం గానీ నివేదిక ఇవ్వటం గానీ చేయలేదు. ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవటంలో హైకోర్టు పొరపడిందా?
ఈ ఫిర్యాదులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ విచారణ చేస్తున్నాయి. మరి కార్యనిర్వాహక వర్గం తీసుకుంటున్న చర్యల్లో హైకోర్టు జోక్యం చేసుకోగలదా?
ప్రాథమిక విచారణ నివేదికపై తామెంతమాత్రం ఆధారపడలేదని కోర్టే చెబుతోంది. మరి పూర్తిస్థాయి దర్యాప్తు కోసం క్రిమినల్ కేసును నమోదు చేయండంటూ ఆదేశించవచ్చా?
హైకోర్టు తన తీర్పులోని 36వ పేరాలో ''అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు"" అని వ్యాఖ్యానించటం ద్వారా నేను దోషినని ముందుగానే నిర్ధారణకు వచ్చేసినట్టు కాదా? వాస్తవానికి శంకర రావు ఈ ఆరోపణలు చేయ టం వెనక దురుద్దేశాలెన్నో ఉండి ఉండొచ్చు. అయితే హైకోర్టు ఇలా ముందుగానే వ్యాఖ్యానించటం ద్వారా శంకర రావు దురుద్దేశాలను పూర్తిగా విస్మరించడం సబబేనా?