అన్నాహజారేకు సెల్యూట్ చేస్తున్నా: ప్రధాని మన్మోహన్
సంస్కరణ వల్లే అవినీతిని రూపుమాపగలమనే విషయాన్ని ప్రతిపక్షాలు కూడా గుర్తించాలన్నారు. కొన్ని రంగాలలో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల అవినీతి రూపుమాపడం కష్టంగా ఉందన్నారు. మన ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయన్నారు. ఇటీవల ఆహార ద్రవ్యోల్భణం పెరిగిందన్నారు. నాపై అవినీతి ఆరోపణలు రావడం బాధాకరం అన్నారు. తన ఆస్తుల వివరాలను ప్రతిపక్ష నేతకు కూడా ఇస్తానని అవసరమైతే పరిశీలించుకోవచ్చునని చెప్పారు. నాపై దాడి వ్యక్తిగతంగా ఉద్దేశించినదే అని అన్నారు. రాష్ట్రాలు సైతం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. లోక్పాల్ బిల్లుపై అన్నాతో కొన్ని అంశాల్లో అవగాహన కుదరలేదన్నారు. అఖిలపక్షంలోనూ అన్నా సూచనలలో ఏకాభిప్రాయం లేదన్నారు.
అవినీతిపై దేశవ్యాప్తంగా రెండు వారాలుగా ఉద్యమం ఉధృతమయిందన్నారు. అన్నా టీం డిమాండ్లను స్టాండింగ్ కమిటీ పరిశీలిస్తోందన్నారు. రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో లోక్పాల్ బిల్లు తయారవుతుందన్నారు. బిల్లుపై అన్ని వర్గాల సూచనలను, సలహాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒక మంచి బిల్లు కోసం అందరి భావాలు అవసరం అన్నారు. బిల్లు కోసం అన్నా సహకారం తప్పకుండా తీసుకుంటామని చెప్పారు. అన్నాహజారే ఆదర్శాలను తాను గౌరవిస్తానన్నారు. ఆయన ఆదర్శాలకు సెల్యూట్ చేస్తానన్నారు. అన్నా దీక్షను విరమింప చేసేందుకు ఎంపీలు సహకరించాలన్నారు. ఆయన తన దీక్షను విరమించాలని కోరారు.