ఇప్పటికైనా వైయస్‌ను వదలండి: బొత్స, సిఎంకు విహెచ్

V Hanumanth Rao
న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేటెంట్ హక్కు తనదని వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంత గట్టిగా చెబుతున్నప్పుడు కాంగ్రెసు పార్టీ వైయస్‌ పేరు ఎత్తడం మానుకోవాలని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు శనివారం ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలకు సూచించారు. జగన్ తనంత తానే కాంగ్రెసు నుండి బయటకు వెళ్లారన్నారు. ఆయనను ఎవరూ పార్టీ నుండి వెళ్లగొట్టలేదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, కాంగ్రెసును జగన్ తీవ్రంగా విమర్శించారన్నారు. పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ సైతం సోనియా అమెరికాలో చికిత్స పొందుతున్న ఈ సమయంలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ బోఫోర్స్ అంశాన్ని చర్చిస్తూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

సాక్ష్యాత్తూ విజయమ్మే రాజీవ్ గాంధీని విమర్శించినప్పుడు మనం వైయస్ పేరు ఎత్తాల్సిన అవసరం లేదన్నారు. వైయస్ విగ్రహాలను జగన్ పెడుతున్నప్పుడు కాంగ్రెసు నేతలు పెట్టడమెందుకని కాంగ్రెసు నేతలను ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెసు ఎప్పుడూ గజదొంగ అనలేదన్నారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. సిబిఐ దర్యాఫ్తు కోర్టు ఆదేశాల మేరకే జరుగుతుందన్నారు. కాంగ్రెసుకు సిబిఐతో సంబంధం లేదన్నారు. వైయస్ పేటెంట్ తమదే అని జగన్ వర్గం నిత్యం అంటోందని వారి పేటెంట్ వారికే ఇచ్చేద్దామన్నారు. కాంగ్రెసుకు సోనియా, రాహుల్ ఉన్నారని అలాంటప్పుడు వైయస్ పేరు ఎందుకు ఎత్తాలని పిసిసి చీఫ్, సిఎంలను ప్రశ్నించారు.

ఇకపై వైయస్ పేరుతో కాకుండా పార్టీ విధానంతో ప్రజల్లోకి వెళదామన్నారు. రెండుసార్లు పార్టీ అధికారంలోకి రావడానికి వైయస్ ఒక్కరే కారణం కాదన్నారు. కాంగ్రెసులోని అందరు నేతలు కష్టపడ్డారన్నారు. 2014 ఎన్నికల్లో వైయస్ పేరు చెప్పి కాకుండా కాంగ్రెసు పేరు చెప్పి ఓట్లు అడుగుతామని సూచించారు. వైయస్ పేరు ఉపయోగించడంపై పార్టీ మేథోమథనం నిర్వహించాలన్నారు. అవినీతిని కాంగ్రెసు ఎప్పుడూ సహించదన్నారు. కాంగ్రెసు మిత్ర పక్షం డిఎంకె ఎంపీలు జైలులో ఉన్నారన్నారు. తాను వైయస్‌ను బతికున్నప్పటి నుండే విమర్శిస్తున్నానన్నారు.

వైయస్ చనిపోయినప్పుడు ఆరువందల మంది చనిపోలేదన్నారు. అదంతా అవాస్తవమన్నారు. జగన్ చేసేది ఓదార్పు యాత్ర కాదన్నారు. మహాత్మా గాంధీ చనిపోయినప్పుడే అంతమంది చనిపోలేదని వైయస్ ఆయనకన్నా గొప్పవాడా అని ప్రశ్నించారు. ఎవరైనా రెండేళ్లు ఓదార్పు చేస్తారా అని జగన్‌ను ప్రశ్నించారు. వైయస్‌కు కాంగ్రెసులో ప్రాధాన్యత కల్పించిందే తానన్నారు. తండ్రి శవం పక్కన పెట్టుకొని అధికారం కోసం సంతకాలు సేకరించిన జగన్‌కు, ప్రధాని పదవి త్యాగం చేసిన సోనియా కుటుంబానికి చాలా తేడా ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర పార్టీ వైయస్ పేరు పేటెంట్ హక్కును జగన్‌కు ఇచ్చేస్తే మంచిదని సలహా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+