కాంగ్రెసుపై ఎదురుదాడే, ప్రతిపక్షాలకు జగన్ లేఖ

వచ్చే ఎన్నికల్లో యుపిఎ పరాజయం తప్పదని సర్వేలు తెలియజేస్తున్నాయని, ది హిందూ, ఇండియా టుడే లాంటి పత్రికలు ఇదే విషయాన్ని ప్రచురించాయని, ఆంధ్రప్రదేశ్లో కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. అందుకే తన ప్రత్యర్థులను సమూలంగా నాశనం చేసేందుకు యుపిఎ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో దక్షిణాదిన కాంగ్రెసు పార్టీ కనుమరుగవుతుందని, అందుకే చివరి ప్రయత్నంగా తన ప్రత్యర్థులను సమూలంగా నాశనం చేయాలని కాంగ్రెసు కుటిల యత్నాలు సాగిస్తోందని ఆయన అన్నారు.
తనకు సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినవారు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందారన్న ఆరోపణలపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారని, అసలు అక్రమాలు జరిగాయా, లేదా అనే విషయంపై ప్రభుత్వం తరఫున ఒక్కరు కూడా చెప్పలేదని, ఒకవేళ అక్రమాలు జరిగితే పెట్టబడిదారులను పిలిచి విచారించాల్సి ఉందని, కానీ ఇక్కడ సిబిఐ రివర్స్లో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనంత తానుగా నిర్ధారణకు వచ్చిందని, పెట్టుబడిదారులను యుపిఎ ప్రభుత్వం వేధిస్తోందని, తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తోందని ఆయన అన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా తనను కేసులో ఇరికించాలని సిబిఐ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. రామ్దేవ్ బాబా బృందంలోనివారిని, అన్నా హజారే బృందంలోని వారిని కూడా యుపిఎ ప్రభుత్వం వేధిస్తోందని ఆయన తప్పు పట్టారు.
మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యపై ప్రాథమిక సాక్ష్యాధారాలున్నా ఆయనపై సిబిఐ కేసును ఎత్తేసి గవర్నర్ పదవి కట్టబెట్టారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసుతో రహస్య ఒప్పందం చేసుకుని రాజకీయాల్లో తను లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications