టిడిపి, కాంగ్రెసులను తాకిన తెలంగాణ సమ్మె సెగ
కాంగ్రెసు నాయకులు మహబూబ్నగర్ జిల్లాలో తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కున్నారు. ఉద్యోగులకు మద్దతు తెలపడానికి వచ్చిన పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథాన్ని, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును తెలంగాణవాదులు నిలదీశారు. అటు కాంగ్రెసు అధిష్టానం చర్చల పేరుతో తెలంగాణ సమస్య పరిష్కారంలో జాప్యం చేస్తుంటే, ఇటు తెలంగాణవాదుల నుంచి కాంగ్రెసు తెలంగాణ నాయకులు వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగావాదాన్ని తమకు అనుకూలంగా మలుచుకోలేని వాతావరణం ఏర్పడింది. రాజీనామాలు చేయాల్సిందేనని తెలంగాణవాదులు కాంగ్రెసు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెడుతున్నారు.
సకల జనుల సమ్మెకు మద్దతుగా తాము రాజీనామా చేసినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కొండా సురేఖ, కుంజా సత్యవతి చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఈ స్థితిలో తెరాస కాంగ్రెసు, తెలుగుదేశం తెలంగాణ నాయకులపై ఎదురుదాడికి దిగుతోంది. సకల జనుల సమ్మె మొదటి రోజే దాని తీవ్రతను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు చవిచూశారు. ముందుకు వెళ్లలేక, వెనక్కి తగ్గలేక వారు సతమవుతున్నారు.