హైటెక్ సిటీ రోడ్డులో ఎమ్మెల్యే హరీష్ రావు అరెస్టు
తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ బుధవారం ఉదయం తెలంగాణ విద్యావంతుల వేదిక బస్సుయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమ్మెతో తెలంగాణ ప్రజలకే నష్టమని ఓ దుష్ప్రచారం జరుగుతోందన్నారు. అది సరికాదన్నారు. ఉద్యమ నాయకత్వాన్ని దెబ్బతీసేందుకే భౌతిక దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టి నాయకత్వాన్ని విడదీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్ దాడికి నిరసనగా బుధవారం తెలంగాణ అంతటా రాస్తారోకోలు, ధర్నాలు చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమం చాలా శాంతియుతంగా జరుగుతోందని దీనిని ఆంధ్రా నేతలు అర్థం చేసుకొని ప్రజాస్వామ్యయుతంగా మసలుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సకల జనుల సమ్మె బుధవారం పదహారవ రోజుకు చేరుకుంది. ఆర్టీసి సమ్మె పదోరోజుకు, మెడికల్ ఐకాస సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కాగా స్వామి గౌడ్పై దాడికి నిరసనగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. మరోవైపు వనస్థలిపురంలో మంగళవారం జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని భారీగా ఆర్ఎఎఫ్ దళాలను మోహరించారు. సచివాలయం వెళ్లే ఉద్యోగులను తెలంగాణ ఆందోళనకారులు అడ్డుకోకుండా ఉండటానికి బలగాలను మోహరించారు.