తెలంగాణపై రాహుల్ గాంధీ కమిటీ, సోనియా ఆలోచన?
తెలంగాణపై పార్టీపరంగా ముందు నిర్ణయం తీసుకుంటే తప్ప కేంద్ర ప్రభుత్వం తేల్చలేని స్థితిలో పడింది. ఈ స్థితిలో పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ఇరు ప్రాంతాల నాయకులతో సంప్రదింపులు జరిపారు. ఆయన తన నివేదికను అక్టోబర్ 10 లేదా 12వ తేదీన సోనియా గాంధీకి సమర్పించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆయన తెలంగాణపై మూడు సిఫార్సులు చేయనున్నట్లు చెబుతున్నారు. అందులో ఒకటి - హైదరాబాదును మినహాయించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. అయితే, దీనికి తెలంగాణవాదులు అంగీకరించడం లేదు. అయితే సీమాంధ్రులు దీనికి అంగీకరించవచ్చు. రెండోది - పదేళ్లపాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. దీనికి కాంగ్రెసు తెలంగాణ నాయకులు అంగీకరిస్తున్నారు. కానీ సీమాంధ్ర నాయకులకు ఇది ఒప్పుకోలు కాకపోవచ్చునని అంటున్నారు. మూడోది - తెలంగాణకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం. అయితే దీనికి తెలంగాణవాదులు అంగీకరించడం లేదు.
ఆజాద్ చేస్తారని చెబుతున్న మూడు సిఫార్సులు కూడా సమస్యను పరిష్కరించేట్లు లేవని అంటున్నారు. ఈ స్థితిలో రాహుల్ గాంధీ నేతృత్వంలో మరో కమిటీని వేయవచ్చునని అంటున్నారు. సమస్యకు ఒకటి కన్నా ఎక్కువ ప్రత్యామ్నాయాలు పరిష్కారం కావనేది అర్థమవుతూనే ఉన్నది. ఈ పరిస్థితిలో ఒకే ప్రత్యామ్నాయంతో రావడానికి రాహుల్ గాంధీకి సమస్యను అప్పగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.