కోదండరామ్ సహా తెలంగాణ కీలక నేతల అరెస్టు
అరెస్టు అయిన సమయంలో కెటిఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై నిప్పులు గక్కారు. ఆందోళనలు ప్రజాస్వామ్య భారతంలో భాగమని, ఆందోళన చేయడం ప్రజల హక్కని దానిని అడ్డుకోవడం సరికాదన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సైతం ఆందోళన చేశారని అప్పుడు ఆయనను అరెస్టు చేయని పోలీసులు ఇప్పుడు తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు తదితరులను అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే వాస్తవ నివేదికలు పంపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అణిచివేత చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. ప్రజాశక్తి ముందు అందరూ తలవంచాల్సిందేనన్నారు. కెటిఆర్ సొమ్మసిల్లి పడిపోయారు.
సచివాలయం వద్ద ఆందోళన చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద తెరాస నేత నాయని నర్సింహారెడ్డిని, సిపిఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల అరెస్టులు ఊపందుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.
కాగా నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చేదు అనుభవం ఎదురయింది. పలువురు తెలంగాణవాదులు కోమటిరెడ్డి కాన్వాయ్ను అడ్డుకున్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పలువురిని అరెస్టు చేశారు.