హైకోర్టు ఆదేశాలు: అప్పుడు జగన్, ఇప్పుడు బాబు

తన ఆస్తులపై విచారణకు ఆదేశించినప్పుడు వైయస్ జగన్ దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా హైకోర్టు తనపై విచారణకు ఆదేశించిందని జగన్ సుప్రీంకోర్టులో వాదించారు. ఇప్పుడు తెలుగుదేశం నాయకులే కాకుండా చంద్రబాబు కూడా అదే వాదనను ముందుకు తెస్తున్నారు. తన వాదనను వినకుండా హైకోర్టు విచారణకు ఆదేశించిందని, ఇది సరికాదని చంద్రబాబు అంటుండగా, హైకోర్టు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా విచారణకు ఆదేశించిందని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. హైకోర్టు ఆదేశాలపై చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
హైకోర్టు ఆదేశాలు వెలువడినప్పుడు సుప్రీంకోర్టు వెళ్లడంపై తెలుగుదేశం నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టారు. జగన్ సిబిఐ విచారణకు అంగీకరించి నిజాయితీని నిరూపించుకోవాలని, ఏ తప్పూ చేయకపోతే జగన్ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్తారని తెలుగుదేశం నాయకులు బల్లలు గుద్ది మరీ అన్నారు. ఇప్పుడు చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి అటువంటి విమర్శలు దాటిగా వచ్చే అవకాశాలున్నాయి. పైగా, తన ఇద్దరు కుటుంబ సభ్యులపై కూడా హైకోర్టు విచారణకు ఆదేశించింది. చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని నిలబెట్టడానికి తన మీడియా ద్వారా శాయశక్తులా ప్రయత్నిస్తున్నారనే రామోజీపై కూడా విచారణకు ఆదేశించడం చంద్రబాబుకు పిడుగులాంటి వార్తే.
తనపై విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశించడం రాజకీయ కుట్రలో భాగమేనని వైయస్ జగన్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెసు, చంద్రబాబు కుమ్మక్కయి తనపై కుట్ర చేశాయని ఆయన విమర్శిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు దాదాపుగా అటువంటి వాదనే చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై పిటిషన్ వేశారని ఆయన ఆరోపించారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి తనపై వేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవడాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుపై వేసిన పిటిషన్ను వైయస్ రాజశేఖర రెడ్డి ఉపసంహరించుకోవడాన్ని అప్పట్లో కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు వంటివారు తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications