12 ఓట్లతో కిరణ్ కుమార్ ప్రభుత్వం గట్టెక్కుతుందా?

శానససభలోని మొత్తం సీట్లు 294 కాగా కొన్ని సీట్లు ఖాళీ కావడంతో మొత్తం 287 మంది శాసనసభ్యులున్నారు. దీని లెక్క ప్రకారం అవిశ్వాస తీర్మానాన్ని ఓడించి, బలాన్ని నిరూపించుకోవాలంటే ప్రభుత్వానికి 144 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, ప్రభుత్వానికి 156 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. వైయస్ జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో, ఓ స్వతంత్ర సభ్యుడితో కలిపి కాంగ్రెసు బలం 154 ఉంది. అయితే, ఇందులోంచి వైయస్ జగన్ వర్గానికి చెందిన 21 మంది వెళ్లిపోతే కాంగ్రెసు బలం 133కు తగ్గుతుంది. ప్రజారాజ్యం పార్టీ సభ్యులు 17 మంది, మజ్లీస్ సభ్యులు ఏడుగురు ప్రభుత్వానికి మద్దతిస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి 156 మంది సభ్యుల బలం ఉంటుంది. ఈ లెక్కన మ్యాజిక్ ఫిగర్కు 12 మంది శాసనసభ్యులు ఎక్కువగా ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు నాయకులు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులకు ఫోన్లు చేసి తమ వైపు రావాలని కోరుతున్నారు. తన శాసనసభ్యులతో వైయస్ జగన్ రేపు మరోసారి సమావేశం కానున్నారు. తన వెంట నడుస్తున్న ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రతిపాదించిన నేపథ్యంలోనే ప్రజారాజ్యం పార్టీకి చెందిన శాసనసభ్యులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిరంజీవి కూడా కాంగ్రెసు నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపైనే కాకుండా ప్రజారాజ్యం పార్టీ సభ్యులకు విప్ జారీ చేసే విషయంపై ప్రభుత్వ విప్ కొండ్రు మురళి చిరంజీవితో మాట్లాడారు. మరోవైపు జగన్ మరింత మందిని తన వైపు లాక్కునే ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణ సాధన కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు కాంగ్రెసు తెలంగాణ శానససభ్యులను కోరుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేస్తామని చెప్పి తెలంగాణను సాధించుకోవాలని వారంటున్నారు.












Click it and Unblock the Notifications