కల్తీసారా అంశంపై చిరంజీవి గరం గరం: సిఎంకు లేఖాస్త్రం
ఎక్సైజ్ శాఖ నిర్లిప్తంగా ఉందని విమర్శించారు. మద్యం అమ్మకాలతో ఖజానా పెంచుకోవడం సరికాదన్నారు. మద్యపాన వ్యతిరేక ప్రచారం ప్రభుత్వ బాధ్యత అన్నారు. మద్యపాన నిషేధం ఎత్తి వేసిన బాబు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. మద్యం సిండికేట్లలో ఎంతటి పెద్దవారున్నా కేసులు పెట్టాలన్నారు. ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మేలా చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం మహమ్మారితో గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందన్నారు. కాగా చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్కు లేఖ రాయడం ఇదే తొలిసారి.
అయితే చిరంజీవి లేఖాస్త్రం ఆయన వర్గంలో వెల్లువెత్తిన అసమ్మతికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మైలవరం సంఘటన ద్వారా చిరంజీవి సిఎం కిరణ్పై పంజా విసిరారని కొందరు భావిస్తున్నారు. ఇటీవల కిరణ్ తన వర్గం నేతలకు మంత్రి పదవులు రాకుండా అడ్డుకున్నందునే చిరు లేఖాస్త్రం సంధించినట్లుగా భావిస్తున్నారు. కాగా మైలవరం బాధితులను చిరంజీవి పరామర్శించే అవకాశం ఉంది. కాగా విజయవాడలోని వెదురుబీడంలో మరో నాటుసారా సంఘటన వెలుగులోకి వచ్చింది. నాటు సారా తాగిన పన్నెండు మంది అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరికి విషమంగా ఉండటంతో వారిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు.