అసంతృప్తి ఫలితంగానే సిఎంపై చిరంజీవి లేఖాస్త్రం?
డిసెంబర్ నెలాఖరున చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరు శాసనసభ్యులను తీసుకోవడానికి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని పార్టీ అధిష్టానం సూచిస్తే దానికి ఏవేవో కారణాలు చెప్పి వాయిదా పడేలా కిరణ్ కుమార్ రెడ్డి చూశారని అంటున్నారు. అంతేకాకుండా, ప్రజారాజ్యం పార్టీ సాంకేతికంగా కాంగ్రెసులో విలీనమైన తర్వాతనే మంత్రి పదవులు ఉంటాయని ఆయన చెప్పారు. దీన్నిబట్టి ప్రజారాజ్యం పార్టీ సాంకేతికంగా విలీనం కావడమనేది ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉందని అంటున్నారు. దీనివల్ల చిరంజీవి వర్గానికి ఇప్పట్లో మంత్రి పదవులు దక్కవనే అభిప్రాయం బలపడిపోయిందని చెబుతున్నారు. దీంతో చిరంజీవి వర్గంలో అసంతృప్తి పెరుగుతోందని చెబుతున్నారు. అదే చిరంజీవి లేఖ రాయడానికి దారి తీసిందని అంటున్నారు.
అవిశ్వాస తీర్మానం సందర్భంగా అధిష్టానం హామీలు ఇచ్చినప్పటికీ అవి అమలు కాకుండా కిరణ్ కుమార్ రెడ్డి అడ్డు పడుతున్నారనే అభిప్రాయం చిరంజీవి వర్గంలో ఏర్పడిందని చెబుతున్నారు. దానికితోడు, చిరంజీవికి చెందిన కొంత మంది శాసనసభ్యులను చేరదీసి, చిరంజీవి అభిమతానికి భిన్నంగా వ్యవహరింపజేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏమైనా, చిరంజీవి కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.