మిథైల్ మోతాదు మించడం వల్లనే మరణాలు
మిథైల్ అధిక మోతాదులో కలపడం వల్లే మరణాలు సంభవించాయని అధికారులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఇదే విషయాన్ని మంత్రి మోపిదేవి కూడా ప్రకటించారు. మృతులు తాగిన సారా శాంపిల్స్ను పరిశోధన కోసం గుంటూరులోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకు పంపారు. కాగా, కల్తీ సారా ఘటనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించాయి. ప్రభుత్వంపై ఐపీసీ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేసి సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
బాధిత కుటుంబాలను ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆ శాఖ కమిషనర్ సమీర్ శర్మ తదితరులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల వంతున నష్టపరిహారం చెల్లిస్తామని మంత్రి మోపిదేవి ప్రకటించారు. మట్టి ఖర్చుల కింద మరో రూ.10 వేలు ఇస్తామని, బాధిత కుటుంబాల్లో అర్హులు ఉంటే రాజీవ్ యువ కిరణాల పథకం కింద ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.