తెలంగాణ ఉపఎన్నికలు: అభ్యర్థులపై కాంగ్రెసు వ్యూహం
కొల్లాపూర్ నుండి జూపల్లి కృష్ణారావుపై పోటీ చేసేందుకు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డిలు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే చిన్నారెడ్డి స్థానికేతరుడు కావడం వల్ల అంత ప్రభావం చూపరనే వాదనలు వినిపిస్తున్నాయి. జూపల్లి కాంగ్రెసు నుండి టిఆర్ఎస్లోకి వెళ్లినందున ఆయనకు గట్టి పోటీ ఇచ్చి గెలిచే అవకాశాలు ఉండే వారిని ఎన్నిక చేసుకోవాలని కాంగ్రెసు భావిస్తోంది. అదిలాబాద్లో జోగు రామన్నపై పోటీ చేసేందుకు ఇద్దరు ప్రధానంగా పోటీ పడుతున్నారు. సర్వే చేసి వారిలో ఒకరిని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. స్టేషన్ ఘనపూర్ నుండి టిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న రాజయ్య కాంగ్రెసు నుండి వెళ్లిన వాడే.
ఈయనపై పోటీకి మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యంతో పాటు మరో ఇద్దరు ప్రధానంగా రేసులో ఉన్నారు. కామారెడ్డి నుండి టిడిపి నుండి వెళ్లిన గంపా గోవర్ధన్పై పోటీకి మాజీ మంత్రి షబ్బీర్ అలీని రంగంలోకి దింపాలని నేతలు భావిస్తున్నప్పటికీ, ఆయన సుముఖంగా లేరట. అక్కడ ఇతర నేతలను ఎవరినైనా రంగంలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సీమాంధ్ర విషయానికొస్తే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజవర్గం నుండి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై శ్రీనివాస రెడ్డి పోటీ చేయనున్నారని సమాచారం.