వైయస్ జగన్ రైతు దీక్షకు తప్పని తెలంగాణ తలనొప్పి
పోలీసులు న్యూడెమొక్రసీ కార్యకర్తలపై లాఠీచార్జీ చేశారు. ఈ లాఠీచార్జీలో కొంత మంది గాయపడ్డారు. దాదాపు 30 మంది న్యూడెమొక్రసీ కార్యకర్తలను అరెస్టు చేశారు. దాంతో పరిస్థితి సద్దుమణగలేదు. మరోసారి రెండో విడత న్యూడెమొక్రసీ కార్యకర్తలు జగన్ దీక్షా శిబిరంలోకి దూసుకొచ్చారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ దూసుకొచ్చిన కార్యకర్తలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, పోలీసులు అడ్డుకున్నారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. దాంతో జగన్ దీక్షకు భద్రత పెంచారు. నిజానికి, న్యూడెమొక్రసీ తెలంగాణ రాజకీయ జెఎసిలో ఉంది. పలు సందర్భాల్లో న్యూడెమొక్రసీ కెసిఆర్ వైఖరిని విమర్శిస్తూ వస్తోంది.
కాగా, జగన్ దీక్షకు భారీ భద్రత కల్పించడాన్ని కాంగ్రెసులోని కొంత మంది నాయకులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పు పడుతున్నారు. చంద్రబాబు యాత్రకు, జగన్ దీక్షకు భారీ భద్రత కల్పించడం సరైంది కాదని కాంగ్రెసు నాయకుడు పాలడుగు వెంకటరావు అన్నారు. దేశం కోసం వారు ఏం చేశారని అంత భద్రత కల్పించారని ఆయన అడిగారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు ముఖ్యమంత్రిపై మండిపడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి, తెలంగాణ ఉద్యమం బలంగా లేదని పార్టీ అధిష్టానానికి చెప్పడానికి తెలంగాణలో చంద్రబాబు, వైయస్ జగన్ యాత్రలకు భద్రత కల్పిస్తున్నారని తెలంగాణవాదులు విమర్సిస్తున్నారు.