రేపు ఢిల్లీకి కిరణ్: చిరు వర్గానికి మంత్రి పదవులు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రస్తుత మంత్రివర్గంలోని ముగ్గురికి ఉద్వాసన పలకాలని ఆలోచిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తనకు ఎప్పటికప్పుడు తలనొప్పులు కలిగిస్తున్న పి. శంకరరావును, అహ్మదుల్లాను, తోట నర్సింహాన్ని మంత్రి వర్గం నుంచి తప్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతిగా జానీని, జయప్రకాష్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పైగా, రామచంద్రయ్యను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై కడప జిల్లా కాంగ్రెసు నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రయ్యపై అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణను మళ్లీ వాయిదా వేయడానికి ప్రయత్నిస్తారా, మొత్తం మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించడానికి పూనుకుంటారా అనేది తెలియడం లేదు. అధిష్టానం ఆదేశిస్తే, ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరితో విస్తరణను పరిమితం చేయవచ్చునని కూడా అంటున్నారు.