చిరంజీవిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గుర్రు

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమైనప్పటికీ తామేదో కాంగ్రెసు పార్టీకి చెందనవారమని, తమదో ప్రత్యేకమైన వర్గమని చిరంజీవి వర్గానికి చెందిన నాయకులు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని, వారు కాంగ్రెసులో పూర్తి స్థాయిలో కలిసిపోవడం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి చెప్పేందుకు సిద్ధపడ్డారని అంటున్నారు. దానివల్ల ఇద్దరికే మంత్రి పదవులు ఇస్తే సమస్య ఎదురవుతుందని, పార్టీలో అసమ్మతి పెరిగే ప్రమాదం ఉందని ఆయన అధిష్టానానికి తెలియజేయనున్నట్లు, తద్వారా మంత్రి వర్గ విస్తరణను మరింత జాప్యం చేయనున్నట్లు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్న విషయం తెలిసిందే.
తనకు కొరకరాని కొయ్యలుగా మారిన మంత్రులను తప్పించి, కొత్తవారిని తీసుకునేందుకు స్వేచ్ఛనివ్వాలని ముఖ్యమంత్రి అధిష్టానాన్ని కోరే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు ఇస్తే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వర్గం మరింత బలపడే అవకాశాలున్నాయని, తాను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పి. శంకర రావులకు చెక్ పెట్టే విధంగా మంత్రి పునర్వ్యస్థీకరణ జరిగేలా చూసుకోవాలనేది ఆయన అభిమతంగా చెబుతున్నారు. కాగా, కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాన్ని దెబ్బ తీసేందుకు ఇప్పటికే బొత్స సత్యనారాయణ, దామోదర రాజనర్సింహ సిద్ధపడినట్లు కూడా సమాచారం.












Click it and Unblock the Notifications