తిరుపతి నుంచి చిరంజీవి సతీమణి సురేఖ పోటీ?
తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలాబలాలపై చిరంజీవి తరుచుగా తన వర్గానికి చెందిన నాయకులను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా తిరుపతి నియోజకవర్గంలో తరుచుగా పర్యటిస్తూ స్థానికులతో సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలోని వర్గ సమీకరణలపై కూడా ఆయన ఆరా తీస్తున్నట్లు సమాచారం. తిరుపతి శాసనసభ నియోజక వర్గం సీటును చిరంజీవి కుటుంబ సభ్యులకు అప్పగించడానికి కాంగ్రెసు అధిష్టానం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
తిరుపతి నుంచి తన బావమరిది అల్లు అరవింద్ను లేదా సోదరుడు నాగబాబును పోటీకి దించే విషయంపై కూడా చిరంజీవి గతంలో ఆలోచన చేశారని చెబుతున్నారు. అయితే, తన సతీమణి సురేఖను పోటీకి దించితే 30 శాతం బలిజ ఓటర్ల మద్దతు పొందడంతో పాటు ఇతర వర్గాల మద్దతు కూడా లభిస్తుందని ఆయన భావిస్తున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. సురేఖను కాంగ్రెసు పోటీకి దింపితే టిడిపి మాజీ శాసనసభ్యుడు చదలవాడ కృష్ణమూర్తి భార్య చదలవాడ సుచరితను పోటీకి దించాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి.