జగన్ వర్గంపై వేటు: ఆజాద్ వ్యాఖ్యల అర్థం అదేనా
ఆయన ఇలా చెప్పడానికి కారణమేంటి? నిజానికి రాష్ట్రంలో ఇప్పటికే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు లేరు. ఆదిలాబాద్లో జోగు రామన్న, నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డి, కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు, స్టేషన్ ఘన్పూర్లో రాజయ్య, కామారెడ్డిలో గంప గోవర్ధన్, కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేయగా మహబూబ్ నగర్లో ఎమ్మెల్యే రాజేశ్వరర్ రెడ్డి ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో ఈ ఏడు స్థానాలకూ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే ఈ ఏడు నియోజకవర్గాల గురించి తాము ఆలోచిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి 13 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాలకు జగన్ వర్గం ఎమ్మెల్యేలు హాజరైతే ప్రభుత్వానికి అవమానకరమే.
అందువల్ల బడ్జెట్ సమావేశాలకు ముందే ఆ 17 మందిపై స్పీకర్ కొరడా ఝళిపించే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ అవి ప్రారంభం కావడానికి వారం ముందు అంటే ఫిబ్రవరి 8న వెలువడే అవకాశం ఉంది. ఆ లోగా జగన్ వర్గ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటువేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇప్పటికే ఖాళీగా ఉన్న ఏడు నియోజకవర్గాలతోపాటు జగన్ వర్గంపై వేటు వల్ల ఖాళీ అయ్యే 17 స్థానాలకూ కలిపి కేంద్ర ఎన్నికల సంఘం ఒకేసారి ఎన్నికలు నిర్వహించే వీలుంటుంది. ఈ విషయాన్నే ఆజాద్ సూచన ప్రాయంగా వెల్లడించారనే వాదనలు వినిపిస్తున్నాయి.