ఎమ్మార్ కేసు, గుండె నొప్పితో ఆస్పత్రిలో బిపి ఆచార్య
ఆయనపై పలు సెక్షన్ల క్రింద సిబిఐ కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, అకౌంట్లు తారుమారు చేశారనే పలు అభియోగాలు మోపింది. ఎమ్మార్ ఒప్పందంలో ఏపిఐఐసి వాటా తగ్గినా ప్రేక్షక పాత్ర వహించారని ఎఫ్ఐఆర్లో సిబిఐ ఆరోపించింది. ప్రభుత్వ వాటా తగ్గడంలో ఆయనదే కీలక పాత్ర అని, మిత్రులకు, సహచరులకు విల్లాలు కేటాయించడంలో సూత్రదారి అని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. కాగా ఇటీవల సునీల్ రెడ్డి తదితరులను సిబిఐ సైలెంట్గానే అరెస్టు చేసింది. ఆచార్య గతంలో ఎపిఐఐసి ఎండిగా పని చేశారు. కాగా ఎమ్మార్ కేసులో బిపి ఆచార్యది నాలుగో అరెస్టు. తనను సిబిఐ అరెస్టు చేసిందని ఆచార్య అధికారులకు సమాచారం అందించారు. బిపి ఆచార్యను రెండు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ఎల్లుండి నాలుగు గంటల వరకు ఆచార్యను కోర్టు సిబిఐ కస్టడీకి అప్పగించింది. విల్లాల విక్రయాల్లో బిపి ఆచార్య కీలక సూత్రధారి అని సిబిఐ చెప్పింది.