జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటులో జాప్యం?

తెలంగాణలోని ఆరు స్థానాలకు, కోవూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతనే వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై వేటు వేయాలనే ఉద్దేశంతో కాంగ్రెసు రాజకీయం నడుపుతున్నట్లు సమాచారం. ఏడు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే వారిపై అనర్హత వేటు వేస్తే రాష్ట్రంలో 24 స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు జరుగుతాయి. దానివల్ల తమకు ఇబ్బంది ఏర్పడుతుందని కాంగ్రెసు నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై చర్యలను వాయిదా వేయడానికి తగిన రాజకీయం నడిపినట్లు చెబుతున్నారు.
ఒకేసారి 24 స్థానాలకు ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెసు పార్టీ భయపడుతున్నట్లు చెబుతున్నారు. దాదాపు మినీ సార్వత్రిక ఎన్నికలను తలపించేలా ఆ ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, వ్యతిరేక ఫలితాలు వస్తే తట్టుకోవడం కష్టమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోనే అనర్హత వేటును వాయిదాకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, తమను శాసనసభలో ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు స్పీకర్ను కోరడానికి సిద్ధపడుతున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి.












Click it and Unblock the Notifications