చంద్రబాబులాంటి వారివల్లే రాజకీయాలు పలుచన: బొత్స
ప్రతిపక్ష నేతగా బాబు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బహిష్కరించారన్నారు. రాజ్యాంగంపై బాబుకు నమ్మకం లేదని తేలిపోయిందన్నారు. ఆయన ఎప్పుడూ అవినీతి, మద్యంను పట్టుకు వేలాడుతున్నారన్నారు. ఒక వేలును ఇతరుల వైపు చూపిస్తే మరో వేలు మనలను చూపిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్ పైన స్టే తెచ్చుకున్న చంద్రబాబుకు అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. స్టే ఎత్తివేత తీసేయించుకొని విచారణ ఎదుర్కొన్న తర్వాతే బాబు అవినీతిపై మాట్లాడాలన్నారు. తనపై ఏ కేసు వేసినా తాను స్టే తెచ్చుకోనని బొత్స స్పష్టం చేశారు. ఒకరి గురించి మాట్లాడే ముందు మనం ఎంత నీతివంతులమో తెలుసుకోవాలన్నారు. బాబు అవినీతి గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.
తనకు 31 మద్యం దుకాణాలు ఉన్నాయని తాను ఎక్కడా చెప్పలేదన్నారు. తన బంధువులు, మిత్రులు తదితరులకు మాత్రమే ఉన్నాయని చెప్పానని, వాటిని కూడా ఎలాంటి అక్రమాలు లేకుండా నడపాలని సూచించానని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నేతలు మాట మీద నిలబడాలన్నారు. బాబు ఇప్పటికైనా మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. విలువ పోగొట్టుకోవద్దన్నారు. ఆయన క్షమాపణ చెప్పాలని తాను డిమాండ్ చేయడం లేదని, తప్పు తెలుసుకుంటే చాలన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్కు మనం తప్పకుండా గౌరవం ఇవ్వాల్సిందేనని అన్నారు.