కెసిఆర్ టార్గెట్గా కిరణ్ కుమర్ రెడ్డి, బాబు కసరత్తు

తెరాస అభ్యర్థులను దీటుగా ఎదుర్కునే అభ్యర్థుల కోసం కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తున్నాయి. స్టేషన్ ఘనపూర్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి కడియం శ్రీహరి పోటీకి దిగే అవకాశం ఉంది. మహబూబ్నగర్ నుంచి మరో మాజీ మంత్రి చంద్రశేఖర్ పోటీకి దిగే అవకాశాలున్నాయి. నాగర్ కర్నూలులో ఓటర్లను అయోమయానికి గురి చేయడానికి నాగం జనార్దన్ రెడ్డిపై మర్రి జనార్దన్ రెడ్డిని పోటీకి దించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి పాయం శంకర్ను పోటీకి దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, కాంగ్రెసు పార్టీ కూడా బలమైన అభ్యర్థుల కోసమే కసరత్తు చేస్తోంది. శుక్రవారంనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మహబూబ్ నగర్ జిల్లా నాయకులతో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఎన్నికలు జరుగుతున్న ఆరు స్థానాల్లో మూడు స్థానాలు మహబూబ్ నగర్ జిల్లాలనే ఉన్నాయి. ఈ మూడింటిలో ఇదివరకు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెసు తరఫున జూపల్లి కృష్ణా రావు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆయన తెరాస నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో అక్కడ తెరాస నుంచి తమ పార్టీలోకి వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డిని పోటీకి దించాలని కాంగ్రెసు నాయకత్వం ఆలోచిస్తోంది. అయితే, మాజీ మంత్రి చిన్నా రెడ్డి పోటీకి దిగుతానని పట్టుబడుతున్నారు.
కాగా, నాగర్ కర్నూలు నుంచి దామోదర్ రెడ్డిని పోటీకి దించాలని కాంగ్రెసు నాయకత్వం ఆలోచిస్తోంది. మహబూబ్నగర్ స్థానం ఇండిపెండెంట్ రాజేశ్వర రెడ్డి ఆకస్మిక మృతి వల్ల ఖాళీ అయింది. ఈ స్థానంలో ఆయన సతీమణి విజయలక్ష్మిని పోటీకి దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే విధంగా చూడాలని గతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓ ప్రతిపాదన పెట్టింది. ఈ ప్రతిపాదనకు బిజెపి కూడా అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే విజయలక్ష్మిని తమ పార్టీ నుంచి పోటీ చేయించడానికి తెరాస తీవ్రంగానే ప్రయత్నాలు చేసి విఫలమైనట్లు తెలుస్తోంది.
తెలంగాణలోని ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి తాము పోటీకి దిగబోమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఇదివరకే ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని తెరాస నాయకులు అంటున్నారు. ఈ స్థితిలో ఒకటి రెండు సీట్లైనా గెలిచి తెరాసకు చెక్ పెట్టాలని తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెసు కూడా ఆలోచన చేస్తున్నాయి. ఈ స్థితిలో తెలంగాణ ఉప పోరు హోరాహోరీగా జరిగే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications