నా కొడుకు పేరు చెప్పి కూడా కోర్టుకెళ్లారు: బాబు
తనపై 35 కేసులు పెట్టారని, 24 విచారణలు జరిపించారని, అయినా తనపై ఒక్క రిమార్కు కూడా లేదని ఆయన చెప్పారు. తనను బ్లాక్మెయిల్ చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తనను ఏమీ చేయలేరోని ఆయన అన్నారు. తన ప్రభుత్వ హయాంలో తాను ఏ తప్పూ చేయలేదని ఆయన అన్నారు. గచ్చిబౌలిలో స్టేడియం కట్టిస్తే కాంగ్రెసు సమావేశాలకు వాడుకుంటోందని ఆయన విమర్శించారు. జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తనను హెచ్చరిస్తున్నారని, తన 9 ఏళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలపై సభలో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. సిబిఐ విచారణ కూడా తన ప్రభుత్వ హయాంలోని నిర్ణయాలను తప్పు పట్టలేదని ఆయన అన్నారు. ఐఎంజీ వ్యవహారంలో కూడా సిబిఐ తనకు క్లీన్చిట్ ఇచ్చిందని ఆయన చెప్పుకున్నారు.
తనపై బురద చల్లాలని ప్రయత్నిస్తే అది వారి మీదే పడుతుందని ఆయన కాంగ్రెసు నాయకులను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెసు నాయకులు భ్రష్టు పట్టించారని ఆయన అన్నారు. చంద్రబాబు వివరణ అనంతరం ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించడానికి ముందు - చంద్రబాబును ఉద్దేశించి గాంధీజీ మాటలను ఉటంకించి - తనకు ఒక రకంగా సంతోషంగా ఉందని, రాష్ట్రంలోని ఏయే పరిశ్రమలను అమ్మేశారో చంద్రబాబు చెప్పారని, సంజాయిషీ ఇచ్చుకున్నారని అన్నారు.