చంద్రబాబు బినామీ ఆస్తుల చిట్టా విప్పిన కెసిఆర్
ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు బలాయిపల్లి గ్రామంలోని భూములను తన బంధువుల పేర్ల మీదికి బదలాయించారని ఆయన చెప్పారు. ఆ భూములు ఎవరెవరి పేర్ల మీద ఉన్నాయి, వారు చంద్రబాబుకు ఏమవుతారానే వివరాలు వెల్లడించారు. చంద్రబాబు తన పేరు మీద ఉన్న 7.1 ఎకరాల భూమిని గిఫ్ట్ కింద తన కుమారుడు లోకేష్ పేరు మీదికి బదలాయించారని ఆయన అన్నారు. లోకేష్ పేరు మీద ఉన్న 6.30 ఎకరాల భూమిని చంద్రబాబు పేరు మీదికి గిఫ్ట్ కింద బదలాయించారని ఆయన చెప్పారు. బలాయిపల్లిలోని 300 ఎకరాల భూములను తన చెల్లెళ్లు, తన బావ ఇతర బంధువుల పేర్ల మీదికి బదలాయించారని ఆయన చెప్పారు. బినామీ ఆస్తుల విషయంలో చంద్రబాబు ప్రపంచంలోనే నెంబర్ వన్ అని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబుది కిరికిరి రాజకీయమని ఆయన అన్నారు. తనకు 70 ఎకరాల భూమి ఉందనే ఆరోపణపై తాను సవాల్ చేసిన తర్వాత చంద్రబాబు నోరు మూశారని, బలాయిపల్లి భూముల గురించి తప్పకుండా చంద్రబాబు నోరు విప్పాలని ఆయన అన్నారు. చంద్రబాబు భూములున్న గ్రామం ఉప ఎన్నిక జరుగుతున్న కోవూరు నియోజకవర్గం పరిధిలోనే ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు బండారం అక్కడ కూడా బయటపడాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తన, తన కుటుంబ సభ్యుల పేర్లను తన బంధువుల పేర్ల మీదికి బదలాయించారని, ఆ బదలాయింపు పత్రాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ భూముల విషయం కాదు, చంద్రబాబు ఆస్తులకు సంబంధించి ఇంకా చాలా ఉన్నాయని, పరంపరగా అవి ముందుకు వస్తాయని ఆయన అన్నారు.
అన్నా హజారే వేలు విడిచిన మేనమామగా చంద్రబాబు ఫోజులు కొడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆస్తుల గురించి అడిగితే సర్వే చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ చెప్పారని, ఇంకా ఎన్నాళ్లు సర్వే చేస్తారని ఆయన అన్నారు.