ఫైల్ తీసుకు రావాలన్న బాబు, అలవాటేనన్న కిరణ్
రాష్ట్రంలోని ప్రజలకు చెందాల్సిన ఆస్తి ఒక్క కుటుంబమే చేజిక్కించుకుందని తెలుగుదేశం పార్టీ నేత తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా తాము గౌరవిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీల్డ్ కవర్లో వచ్చారా సూట్ కేసులతో వచ్చారా అనేది తమకు సంబంధం లేదని అన్నారు. ఆయన ఎలా వచ్చినా రాష్ట్రంలో జరిగిన భారీ అవినీతిని వెలికి తీయాలని మేం ప్రయత్నించామన్నారు. కానీ మా ఆశలు నెరవేరలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప రైతులకు చేసిందేమీ లేదన్నారు. ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగవుతుందో కూడా ప్రభుత్వానికి తెలియదన్నారు. విత్తనాల ఇండెంట్ ను కూడా సరిగా పంపడం లేదని విమర్శించారు. నెత్తురు చిందించకుండా రైతులకు విత్తనాలు దొరికే పరిస్థితి లేదని విమర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వం ఏడేళ్ల కాలంలో ఏడువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలోన వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని విమర్శించారు.