భవిష్యత్తు మాదే, వెన్నుపోటు తెలియదు: డిప్యూటీ సిఎం
పార్టీకి, ప్రభుత్వానికి తన బలం చూపించుకోవడానికే రాజనర్సింహ చమార్ల సమావేశం పెట్టినట్టు వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. ఈ కార్యక్రమం ద్వారా రాజకీయంగా ఎదగాలని నేను అనుకుంటున్నట్లు కొందరు అనుమానిస్తున్నారని, మరికొందరు ఆశ్చర్యపడుతున్నారని, అలాంటి సందేహాలు అక్కర్లేదన్నారు. 18 ఏళ్ల తర్వాత ఒక చమార్కు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని, వెన్నుపోటు పొడిచే జాతి కాదు మాది కాదన్నారు. సై అంటే సై అనే జాతి అన్నారు. నిబద్ధత, క్రమశిక్షణ మా సొంతమన్నారు. అదే సమయంలో అమాయకులమన్నారు. అయితే, అసమానత కనిపిస్తే చమార్లు సహించరని, తిరగబడతారని హెచ్చరించారు. ఇకపై ప్రతి జిల్లాలోనూ చమార్ల సమావేశాలు పెడతామని, దీనిపై రాజకీయం చేసినా, అడ్డుకునే ప్రయత్నం చేసినా చమార్లు ఊరుకోరని హెచ్చరించారు. మనిషి సంఘజీవి, స్వార్థజీవి అని అయితే సంఘంలో స్వార్థాన్ని పెంచుకుని వివక్షత, కులవ్యవస్థను ఏర్పాటు చేశారని, మూడు వేల ఏళ్ల ఈ వ్యవస్థను కూలగొట్టేందుకు స్ఫూర్తి కావాలన్నారు. 3 వేల ఏళ్లుగా బడికి, గుడికి చమార్లు నోచుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాభిమానంకంటే గొప్పది లేదని, ఆత్మాభిమానమే ముఖ్యమన్న చమార్ల ఆరాధ్యుడు సంత్ గురు రవిదాస్ ప్రవచనాల గొప్పతనాన్ని దామోదర వివరించారు.
దళిత జాతిలో పుట్టిన రవిదాస్ చమార్నని గొప్పగా చెప్పుకొన్నారన్నారు. ఏడు వందలేళ్ల క్రితమే సామ్యవాదం బోధించారన్నారు. విశ్వాసం ముఖ్యమని, అదే సమయంలో అది బలహీనత కూడా అని హితవు పలికారు. మన విశ్వాసం తప్పుదార్లో ఉంటే దుర్మార్గానికి దారి తీస్తుందని హెచ్చరించారు. మతం ఏదైనా చమార్లంతా ఒక్క జాతిగా ముందుకు రావాలని, గురు రవిదాస్ను ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. విద్యాధికులు కావాలని, అప్పుడే ఆత్మస్థైర్యం, తర్కించే గుణం పెరుగుతుందని, దానికోసం పిల్లలను చదివించాలని పిలుపునిచ్చారు. దళితులకూ ఒక మహారాజు ఉన్నాడనే విషయం సమ్మేళనంతో తెలిసిందని మంత్రి ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దళితుల మనోభావాలు దృఢపడతాయన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు.