భవిష్యత్తు మాదే, వెన్నుపోటు తెలియదు: డిప్యూటీ సిఎం

Damodara Rajanarsimha
హైదరాబాద్: రాబోయే ఇరవై ముప్పయ్యేళ్లలోపు ఈ దేశాన్ని పాలించే సత్తా మాదేనని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం చమార్ సమావేశంలో అన్నారు. సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎల్బీ స్డేడియంలో జరిగిన అంతర్జాతీయ చమార్ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చమార్ సమావేశానికి అనేక మంది ఇబ్బందులు సృష్టించారని అన్నారు. ఈ దేశ మూలవాసులుగా ఆస్తి మాది అన్నారు. భవిష్యత్తు తమదనని, అసమానతలు, అన్యాయం, అవహేళన ఎక్కడ ఉంటే అక్కడ తిరగబడతామమన్నారు. భవిష్యత్తులో పాలించే పాలించే సత్తా మనదేనని ఆ దిశగా సంఘటితమై ముందుకు వెళదామని చమార్లకు పిలుపునిచ్చారు. 18 ఏళ్ల తరువాత రాష్ట్రంలో తొలిసారిగా ఒక చమార్‌కు ఉప సిఎం పదవి లభించిందని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలుంటే చమార్‌లు తిరగబడతారని హెచ్చరించారు. ధార్మిక చింతన ద్వారా సమాజంలో చైతన్యం తేవాలని, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా సంఘటితం కావాలని చమార్లకు ఆయన పిలుపునిచ్చారు.

పార్టీకి, ప్రభుత్వానికి తన బలం చూపించుకోవడానికే రాజనర్సింహ చమార్ల సమావేశం పెట్టినట్టు వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. ఈ కార్యక్రమం ద్వారా రాజకీయంగా ఎదగాలని నేను అనుకుంటున్నట్లు కొందరు అనుమానిస్తున్నారని, మరికొందరు ఆశ్చర్యపడుతున్నారని, అలాంటి సందేహాలు అక్కర్లేదన్నారు. 18 ఏళ్ల తర్వాత ఒక చమార్‌కు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని, వెన్నుపోటు పొడిచే జాతి కాదు మాది కాదన్నారు. సై అంటే సై అనే జాతి అన్నారు. నిబద్ధత, క్రమశిక్షణ మా సొంతమన్నారు. అదే సమయంలో అమాయకులమన్నారు. అయితే, అసమానత కనిపిస్తే చమార్లు సహించరని, తిరగబడతారని హెచ్చరించారు. ఇకపై ప్రతి జిల్లాలోనూ చమార్ల సమావేశాలు పెడతామని, దీనిపై రాజకీయం చేసినా, అడ్డుకునే ప్రయత్నం చేసినా చమార్లు ఊరుకోరని హెచ్చరించారు. మనిషి సంఘజీవి, స్వార్థజీవి అని అయితే సంఘంలో స్వార్థాన్ని పెంచుకుని వివక్షత, కులవ్యవస్థను ఏర్పాటు చేశారని, మూడు వేల ఏళ్ల ఈ వ్యవస్థను కూలగొట్టేందుకు స్ఫూర్తి కావాలన్నారు. 3 వేల ఏళ్లుగా బడికి, గుడికి చమార్లు నోచుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాభిమానంకంటే గొప్పది లేదని, ఆత్మాభిమానమే ముఖ్యమన్న చమార్ల ఆరాధ్యుడు సంత్ గురు రవిదాస్ ప్రవచనాల గొప్పతనాన్ని దామోదర వివరించారు.

దళిత జాతిలో పుట్టిన రవిదాస్ చమార్‌నని గొప్పగా చెప్పుకొన్నారన్నారు. ఏడు వందలేళ్ల క్రితమే సామ్యవాదం బోధించారన్నారు. విశ్వాసం ముఖ్యమని, అదే సమయంలో అది బలహీనత కూడా అని హితవు పలికారు. మన విశ్వాసం తప్పుదార్లో ఉంటే దుర్మార్గానికి దారి తీస్తుందని హెచ్చరించారు. మతం ఏదైనా చమార్లంతా ఒక్క జాతిగా ముందుకు రావాలని, గురు రవిదాస్‌ను ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. విద్యాధికులు కావాలని, అప్పుడే ఆత్మస్థైర్యం, తర్కించే గుణం పెరుగుతుందని, దానికోసం పిల్లలను చదివించాలని పిలుపునిచ్చారు. దళితులకూ ఒక మహారాజు ఉన్నాడనే విషయం సమ్మేళనంతో తెలిసిందని మంత్రి ప్రసాద్‌ కుమార్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దళితుల మనోభావాలు దృఢపడతాయన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+