బాబూ! పార్టీని మూసేసి ఇంట్లో కూర్చుంటావా!: కెటిఆర్
2009 ఎన్నికల సమయంలో తమతో పొత్తు కోసం చంద్రబాబే ఉత్సాహపడ్డారని ఆయన అన్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పని చంద్రబాబు కెసిఆర్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఎంతగా గీపెట్టినా, చంద్రబాబు పెంపుడు జంతువులు ఎంతగా అరిచినా తెలుగుదేశం పార్టీకి ప్రజలు చెంపపెట్టు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. స్టేలు తెచ్చుకోకపోతే చంద్రబాబు చర్లపల్లి జైలులో చిప్పకూడా తింటూ ఉండేవారని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబును ఆయన చచ్చిన పాముగా అభివర్ణించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు పాతర వేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధపడి ఉన్నారని ఆయన అన్నారు. లోకసభను తెలంగాణపై కెసిఆర్ వారం రోజులు స్తంభింపజేశారని, అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడేలా చేసింది కెసిఆరేనని ఆయన అన్నారు. పార్టీని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కాంట్రాక్టర్లకు దారాదత్తం చేశారని ఆయన ఆరోపించారు. పార్టీలో నాయకులే లేనట్లు సుజనా చౌదరికి, నామా నాగేశ్వర రావుకు చంద్రబాబు సీట్లిచ్చారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సంఘీభావం తెలపడానికి చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెనకడుగు వేశారని ఆయన అన్నారు. అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గన్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.