టిడిపిలో ఏడు గంటల హైడ్రామా, నెగ్గించుకున్న బాబు
కానీ దేవేందర్ గౌడ్ విషయంలో మాత్రం పార్టీలు ససేమీరా అన్నారని సమాచారం. సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకొని ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లి, పార్టీని, పార్టీ నేతను తిట్టిన దేవేందర్కు పదవి ఎలా ఇస్తారంటూ నేతలు బాబును ప్రశ్నించారు. తలసాని, కోడెల, కెఈ వంటి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర నుండి కమ్మ వర్గానికి, తెలంగాణ నుండి మైనార్టీలకు చోటు కల్పించాలని అధినేతకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. దీంతో ఓ దశలో దేవేందర్ను పక్కన పెట్టి సలీం అభ్యర్థిత్వాన్ని పరిశీలించారు. అయితే తెలంగాణ నేతలు పలువురు సలీం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. దీంతో మళ్లీ దేవేందర్ పేరే తెర పైకి వచ్చింది.
దీంతో ఇంటికి వెళ్లిన దేవేందర్ను బాబు మళ్లీ పిలిపించారు. తిరిగి వచ్చిన దేవేందర్ తాను పార్టీని వీడి వెళ్లడం పొరపాటేనని, ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయనని, నన్ను రాజ్యసభకు పంపితే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని బాబుకు, నేతలకు హామీ ఇచ్చారట. అదే సమయంలో బాబు కూడా వివిధ సమీకరణాలు, ఇతరత్రా పరిస్థితులను పోలిట్ బ్యూరో సభ్యులకు వివరించి ఆయనకు ఇవ్వాల్సిన ఆవశ్యకతను చెప్పారు. ఆయన వల్ల పార్టీకి కలిగే ప్రయోజనాలు వివరించారు. దీంతో ఆయన పేరును పోలిట్ బ్యూరో ఖరారు చేసింది. అయితే ప్రస్తుతానికి సద్దుమణిగినట్లుగా కనిపిస్తున్నప్పటికీ అసంతృప్తితో ఉన్న నేతలు ఎప్పుడైనా ఆగ్రహం వెలుబుచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.