కిరణ్కు ఉప ఎన్నికల వర్రీ: అంతటా కష్టమే
సర్వే నివేదికలను మాత్రమే కాకుండా ఇతరత్రా సమాచారాన్ని కూడా వారు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఏడు సీట్ల విషయంలో తేల్చేశారు. ఏడు స్థానాల్లో కూడా సిట్టింగులే గెలుస్తారంటూ తన సర్వేను బయటపెట్టి కాంగ్రెసు నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. వచ్చే 18 సీట్లలో ఆ ప్రముఖ తెలుగున టీవీ చానెల్ సర్వే నిర్వహించింది. మెజారిటీ సీట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుచుకుంటుందని, ఒక్కటి రెండు సీట్లలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశాలున్నాయని ఆ సర్వే తేల్చింది.
ఉప ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై కాంగ్రెసు పార్టీలో ప్రణాళిక లేదని, కీలకమైన నేతల మధ్య సమన్వయం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే 2014 ఎన్నికల్లో కూడా కష్టమే అవుతుందని అంటున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య కూడా సమన్వయం లేదని అంటున్నారు. సీనియర్ల అభిప్రాయాలను కనుక్కుని, వారిని భాగస్వాములను చేయడంలో ముఖ్యమంత్రి విఫలమవుతున్నారనే విమర్శ పార్టీ నాయకుల నుంచే వస్తుంది. సీనియర్ కాంగ్రెసు నాయకుడు వి. హనుమంతరావు వంటివారు బహిరంగంగానే ఆ మాట అంటున్నారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడి వ్యవహార శైలి మారితే తప్ప పరిస్థితి చక్కబడదని అంటున్నారు.