రేపే లెక్కింపు: కోవూరుపై ఉత్కంఠ, తెలంగాణ సీట్లపై ఆసక్తి
కాగా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సాధించే ఓట్ల శాతాన్ని బట్టి ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఐదు స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థులు, ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి గెలుచుకుంటారని చెబుతున్నారు. అయితే, ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావని తెరాస ప్రచారం సాగిస్తూ వచ్చింది. అయితే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఒకటి రెండు చోట్ల రెండో స్థానంలో వచ్చి, మెజారిటీ స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకుంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వ్యూహం పదునెక్కుతుందని చెబుతున్నారు.
కాగా, కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని అంటున్నారు. కాంగ్రెసు పార్టీ మెజారిటీ స్థానాల్లో మూడో స్థానంలో నిలిస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇరకాటంలో పడాల్సి వస్తుందనే మాట వినిపిస్తోంది. ఈ ఏడు స్థానాల్లో కాంగ్రెసు అభ్యర్థులు సాధించే ఓట్లపైనే వచ్చే 18 స్థానాల ఉప ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కుంటుందనే విషయంపై అంచనా ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఏమైనా, అన్ని పార్టీలకు ఈ ఉప ఎన్నికలు భవిష్యత్తును నిర్ధారించేవిగానే ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.