సిఎంపై కుట్రలు, తెలంగాణ వస్తేనే మార్పు: సర్వే
కాంగ్రెసులోని కొంత మంది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్తో, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని, సమయం వచ్చినప్పుడు వివరాలు బయటపెడతానని ఆయన అన్నారు. రోజుకో ముఖ్యమంత్రిని మార్చినా సీనియర్లు అసంతృప్తి గళం విప్పుతూనే ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీని నాశనం చేయడానికి కొందరు కంకణం కట్టుకున్నారని, పార్టీ కార్యకర్తలే వారికి బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని బజారుకీడ్చే నాయకులు ఖబడ్దార్ అంటూ వారిని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి పదవి కోసమే కిరణ్ కుమార్ రెడ్డిపై కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన జరిగితే తప్ప ముఖ్యమంత్రి మార్పు ఉండదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడానికి తెలంగాణలో సమర్థ నాయకుడు ఉన్నాడా అని ఆయన ప్రశ్నించారు. 2014కు ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అన్నారు. వచ్చే 18 స్థానాల ఉప ఎన్నికల్లో కాంగ్రెసును గెలిపించే బాధ్యతను తీసుకోవాలని, ఆ స్థానాల్లో కాంగ్రెసును గెలిపిస్తే తాము తెలంగాణ అడగబోమని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో ప్రచారం చేయనివారు కూడా ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులు, మంత్రులు ఎంత మంది ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారని ఆయన అడిగారు.