చిరంజీవి ఇలాకా మొగల్తూరులో జగన్ 'పవర్' ఫైట్
ధర్నాకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. దారి పొడవునా పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు జై జగన్ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన హయాంలో రైతులను కాల్చి చంపారని విమర్శించారు. విద్యుత్ బకాయిల కోసం ఆయన జివోలు జారీ చేశారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందన్నారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉప ఎన్నికలు జరగనున్న పద్దెనిమిది నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి పిలుపునిచ్చారు. ప్రజల తీర్పుతో పాలకులకు సమస్యలు అర్థం కావాలన్నారు. ఇప్పటి ప్రభుత్వం కరెంట్ ఎన్ని గంటలు ఇస్తుందని కాకుండా ఎన్ని గంటలు ఉంటుందా అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
కాగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుపతిలో ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా భూమన మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు పోరాడుతామన్నారు. ప్రజల పాలిట కాంగ్రెసు ప్రభుత్వం శాపంగా మారిందన్నారు.