గెలిస్తే 2014 వరకు ఆగాల్సిన పని లేదు: వైయస్ జగన్
ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అన్ని స్థానాలలో ఘన విజయం సాధిస్తుందని అన్నారు. వైయస్సార్సీ క్లీన్ స్వీప్ చేస్తే వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలుపోతుందని ఆయన అన్నారు. అప్పుడు 2014 వరకు ఆగాల్సిన పని లేదని, వెంటనే ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఆ ప్రభుత్వం రాష్ట్రంలో సువర్ణ పాలన అందిస్తుందని అన్నారు.
ఉప ఎన్నికల్లో పేదవాడు పడుతున్న బాధలేమిటో పాలకులకు అర్థమయ్యేలా తీర్పు ఇవ్వాలన్నారు. అధిష్టానం రిమోట్ కంట్రోల్తో రాష్ట్రాన్ని నడిపిస్తోందన్నారు. రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కరెంట్ బిల్లులు ముట్టుకుంటేనే షాక్ కొడుతుందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం పాలన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాలనను తలపిస్తోందన్నారు.
బిల్లులు కట్టని రైతులను అరెస్టు చేయాలంటూ జీవోలు కూడా జారీ చేస్తున్నారని ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు ఛార్జీలు పెంచిందన్నారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు తన హయాంలో రైతులను కాల్చి చంపారని ఆరోపించారు.